Friday, August 15, 2025

 అందరికీ శుభ సాయంకాలం.

 
ఈ రోజు ఒక మిత్రుడు మాట్లాడుతూ మార్క్స్ "కాపిటల్" చదవకుండా ఈ ధరల్ని అర్థం చేసుకోవడం తేలిక కాదు అన్నాడు. దాన్ని అర్థం చేసుకోవడమనేది అంత లోతైన విషయమేమీ కాదనేది రోడ్డు ప్రక్కన మిర్చీ బడ్డీ పెట్టుకొని జీవనం సాగించే వ్యక్తికీ తెలుసు. 
అయితే ఈ నాటి గ్లోబలైజేషన్ విధానంలో వస్తువు విలువను రూపొందించాల్సిన విధానం భారతీయ సాహిత్యం ఎలా చెపుతుందో ఒకసారి చూద్దాం.

ఆర్థిక స్వావలంబనకు నాలుగు పార్శ్వాలుంటాయి. మొదటిది అమ్మకం ద్వారా మనం పొందిన డబ్బు.. దీనినే Price అంటాం. రెండవది ఆ వస్తువు తయారీకి మనం వ్యయించిన సొమ్ము... దీనినే Rate అంటాం. మూడవది ఆ వస్తు ఉత్పత్తికి మనం పెట్టిన శ్రమ.. దీనినే Value అంటాం. ఇక చివరిది.. మన ఖర్చులన్నీ పోను నికరంగా మనకు మిగిలే సొమ్ము... దీనినే Wealth అంటాం. ఇందులో ఎప్పుడు కూడా మొదటిది అంటే Price తగ్గించుకోవాలి. అప్పుడా వస్తువు అందరికీ అందుబాటులోకి వస్తుంది. అమ్మకాలు పెరుగుతాయి... Goodwill పెరుగుతుంది.. ప్రాచుర్యం పెరుగుతుంది. ఇక రెండవది అంటే Rate పెంచుకోవాలి. దీని వల్ల నాణ్యత పెరుగుతుంది. నాణ్యత వినియోగదారుని మన్ననలను పొందుతుంది. ప్రచారం పెరుగుతుంది. మూడవది అంటే Value అభివృద్ధి పరచాలి. దీని వల్ల నిరంతరం క్రొత్తదనం అన్వేషిస్తూ సాంకేతికతను అభివృద్ధి చేస్తాం. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో సమున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తిని సాధించే ప్రయత్నం చేస్తాం. దానితో ఉత్పాదకత పెరుగుతుంది. ఏ సంస్థలో నైనా ఈ ప్రక్రియ నిరంతరం  సాగిపోయినట్లయితే ఆ సంస్థ ఆర్థికంగా బలపడుతుంది. ఆర్థిక పునాదులు బలోపేతమైన సంస్థ ఉద్యోగుల అవసరాలను తీర్చగలుగుతుంది... సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతుంది. చుట్టూ ఉండే సమాజాన్ని ప్రగతి వైపు నడిపించ గలుగుతుంది. ఇక నాలుగవది.. Wealth ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి యైనా లేదా సంస్థ యైనా సంతోషంగా ఉండగలుగుతుంది. నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. నలుగురుకి ఉపయుక్త మౌతుంది. సమాజంలో గుర్తింపు పొందుతుంది. కాని ఎప్పుడైతే ఆదాయం ఖర్చుకన్నా తక్కువైతే ఆ సంస్థ నిలవడమే ప్రశ్నార్థకమౌతుంది. ఉనికియే ప్రమాదంలో పడిన సంస్థ తన ఉద్యోగులకుగాని, ఖాతాదారులకుగాని ఏ విధంగా ఉపయోగపడదు. మిగులు సొమ్ము మన వద్ద ఎంత ఎక్కువగా ఉంటే అంత ధీమా….గౌరవం.
          ఈప్రక్రియలో మరో ముఖ్య కోణం ఏమిటంటే.. వ్యర్దాలను నియంత్రించడం... వ్యర్ధాలనెంత సమర్థవంతంగా నియంత్రణ చేసుకుంటే అంత అభివృద్ధి సంస్థలో కనిపిస్తుంది. ఎంత సమర్ధవంతుడైన యజమాని ఉన్నా, ఎంత చక్కని యోజనా ప్రణాళికలు వినియోగించినా...నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి సాధింపబడినా సమర్థులైన ఉద్యోగులు ఎంత అంకితభావంతో శ్రమించినా... అమ్మకాలు ఎంతగా పెరిగినా వ్యర్థ నియంత్రణ లేని సంస్థ నష్టాలలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. నష్టాలతో ఎవరూ సంస్థను నడపలేరు. సంస్థ నిలవక పోతే ఉద్యోగులకు ఉపాధిపోతుంది. అందువల్ల పరస్పరాధారిత విధానంలోనే ప్రయోజనం ఉంటుంది.
ఎవరెంత చెప్పినా వక్ర దృష్టి మారనంత వరకు వారు మారరనేది యదార్ధం. అలాంటి వారి దృష్టిని  ఆకర్షించేవి ఏమిటో కూడా ఒక కవి చాటువుగా చెప్పిన పద్యంతో ముగింపు పలుకుతున్నాను.
ఎవ్వతె వీవు కాళ్ళు మొగ మెర్రన; హంసను, ఏడ నుందువో?
దవ్వున మానసంబునను, దాన విశేషము లేమి తెల్పుమా?
మవ్వగు కాంచనాబ్జములు మౌక్తికముల్ గల వందు; నత్తలో?
అవ్వి యెరుంగ నన్న హహహా యని నవ్వె బకంబు లన్నియున్!

ఒక హంస ఒకనాడు దారి తప్పి ఒక మడుగు చేరిందట. అక్కడ కొన్ని కొంగలు ఉన్నాయి. తమ ఆకారానికి భిన్నంగా ఉన్న ఆ హంసను, దాని అందాన్ని, దాని సౌకుమార్యాన్నిచూచి ఈర్ష్య పడిన కొంగలు ఆ హంసను చుట్టుముట్టి అడిగాయట. "నీ వెవ్వరు నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉన్నాయేమిటి? హంస చెప్పింది తాను హంసనని. ఎక్కడుంటావని కొంగల ప్రశ్న... చాలా దూరంగా మానస సరోవరంలో ఉంటానని హంస జవాబు. అయితే అక్కడి విశేషాలేంటి... కొంగల ప్రశ్న.. అక్కడ అందమైన కోమలమైన ముత్యాలు మరియు బంగారు పుష్పాలుంటాయని చెప్పింది, హంస. కొంగలకు అది అర్థం కాలేదేమో అందుకే అడిగాయట... మరి అక్కడ నత్తలుంటాయా? అని. అప్పుడు తెల్లబోయిన హంస అవి (నత్తలు) నాకు తెలియదు అన్నదట. దానికి ఆ కొంగలన్నీ హహహా అని నవ్వాయట". చిన్నప్పుడు ఎప్పుడో విన్న చాటువు పద్యం.
పాలకుర్తి రామమూర్త

No comments: