Sunday, August 17, 2025

 సంఘర్షణలో సానుకూలత ఆదరణీయం..


యః సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం

నభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా!

(భగవద్గీత - 2-57)

దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషము, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖములాంటి వికారములకు లోనుగాని వాడే స్థితప్రజ్ఞుడు అంటున్నాడు, కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్షలనైనా తట్టుకోగలిగే శక్తిసామర్ధ్యాలు, సమస్యలను అధిగమించే బుద్ధి సంపద, దేనికోసం దేనిని ఆదరించాలనే విచక్షణతో కూడిన స్వేఛ్చ.. స్థిత ప్రజ్ఞునిలో సహజ లక్షణాలుగా ప్రకాశిస్తాయి.

సృష్టిలో ద్వంద్వాలు సహజాలు. అలాగే ఒక పనిని చేస్తున్నప్పుడు లాభనష్టాలు, జయాపజయాలు కలుగుతాయి. శుభమైనా అశుభమైనా.. మంచైనా చెడైనా అవి మనస్సులో వెలుగు చూచే అభిప్రాయాలే కాని బాహ్య సన్నివేశాలు కావు. పుస్తకంలో వర్ణించిన నవరస భరిత సన్నివేశా లెలాగైతే పుస్తకానికి అంటుకుపోవో అలాగే శుభాశుభములు స్థితప్రజ్ఞునికి అంటుకుపోవు. ఒకరంగు పాత్రలో పోసిన నీరు మరొకరంగు పాత్రలో పోసిన నీటికి భిన్నంగా కనిపించినా రెంటిలో ఉన్నది ఒకేనీరనే భావన స్థితప్రజ్ఞుడు పొందగలుగుతాడు.

రెండూ భిన్నమనే భావనయే సంఘర్షణకు దారితీస్తుంది. అలాంటి సంఘర్షణలో కూడా సానుకూలతను అన్వేషించడమే స్థితప్రజ్ఞత. యుద్ధవిద్యలో ఎదుటి వ్యక్తి దాడి చేసిన సమయంలో ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవరచుకోవాలని నిపుణులు చెపుతారు. ప్రశాంత స్థితిని పొందిన మనసును యదేఛ్చగా వదిలివేస్తే .. అది పరిష్కారం దిశగా సాగుతుంది. ప్రశాంతత జీవన కేంద్రమై, ఆలోచన ఉత్తేజితమౌతుంది. కర్తవ్యం బోధపడుతుంది. ఎక్కువలో ఎక్కువగా ఏమవుతుంది?  ఎదుటి వ్యక్తి బలవంతుడైతే మనలను చంపేయవచ్చు. పెనుగులాడినా అదెలాగూ జరుగుతుంది. ప్రశాంతతను ఆదరిస్తే.. ప్రమాదం నుండి బయటపడే పరిష్కారం స్పురించవచ్చు. ప్రశాంతమైన మనసును దేనిపై లగ్నం చేస్తే దానినే సాకారం చేస్తుందది. మనసును వదిలివేస్తే అది పసిపాపలా అన్నింటినీ అద్భుతాలుగా భావిస్తుంది.. ఆస్వాదిస్తుంది. పసిపిల్లల మనసులో భేదభావనలు నిలువవు.. గతం పట్ల విచారం కాని భవిష్యత్తు పట్ల ఆందోళనకాని ఉండవు.. వర్తమానాన్ని అస్వాదిస్తారు.. ఆనందిస్తారు. సగటున పసిపిల్లలు రోజుకు మూడు వందల మార్లు నవ్వుతారని చెపుతారు.

ప్రశాంతమైన మనసుతో సముద్ర తరంగాలపై విహరించే వ్యక్తి ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. తరంగాలు పైకి లేపిన వేళ పూర్తి స్పృహతో తెలివితో దానికి అనుకూలంగా స్పందిస్తాడు.. పడిపోయినా "ఎఱుక"తో పడిపోతాడు.. పడిలేవడాన్ని సమచిత్తంతో ఆహ్వానిస్తాడు..  ఆనందిస్తాడు.. అద్భుతంగా భావిస్తాడు.. ఆస్వాదిస్తాడు. ఇక్కడ "పడడం" అనేది సమస్యగా భావిస్తే.. జయాపజయాలకు అతుక్కుపోతాడు.. దానితో ఒత్తిడి పెరుగుతుంది.. నిరాశానిస్పృహలు పెరిగిపోయి.. మనసును సంఘర్షణకు గురిచేస్తాయి. అలాకాక వాటిని సహజంగా భావిస్తే స్థితప్రజ్ఞతను ప్రదర్శిస్తాడు. సమస్య నుండి పారిపోవడం కాక దానిని ఎలా ఎదిరించాలో ఆలోచిస్తూ.. సానుకూలతను ఆదరిస్తే సంఘర్షణను అధిగమించడం సాధ్యపడుతుందని కృష్ణపరమాత్మ బోధిస్తున్నాడు.

దానిని సాధించడం ఎలా? ప్రశాంతమైన మనసుతో.. సమస్య పట్ల అవగాహనను పెందుకుంటే.. అంతర్మనస్సు పరిష్కార మార్గాన్ని అందిస్తుంది. కాని చాలా మంది పరిష్కారంలో భాగంగా కాక సమస్యలో భాగమౌతుంటారు. అదే సంఘర్షణను పెంచుతుంది. రెండావులను అడిగి ద్రుపదునితో అవమానింపబడిన ద్రోణుడిలోని సంఘర్షణ ద్రుపదునిపై ప్రతీకారానికి ప్రేరణనిచ్చింది. తద్వారా ద్రుపదునిలో వెలుగుచూచిన సంఘర్షణ ద్రోణవధ లక్ష్యంగా దృష్టద్యుమ్నునికి జన్మనిచ్చింది. అస్త్రవిద్యా ప్రదర్శనలో అవమానింపబడిన కర్ణుడు, అర్జునునిపై పెంచుకున్న మాత్సర్యం అతడిని జీవితాంతమూ సంఘర్షణకు లోనుచేసింది. కర్ణుని పరాక్రమాన్ని తలుచుకొని ధర్మరాజూ సంఘర్షణకు లోనయ్యాడు.. దానికి ప్రతిగా వారు సానుకూల వైఖరితో ఆలోచించి ఉంటే ఫలితం వేరుగా ఉండేది.

పాలకుర్తి రామమూర్తి

 ద్రోణుని రెండావుల యాచన.. పరిణామం..


ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుండగు వానితోడ మూ

ర్ఖునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణ శూరుతోడ భీ

రునకు, వరూధితోడ నవరూధికి, సజ్జను తోడఁ గష్ట దు

ర్జననుకు నెవ్విధంబున సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే! 

(మహాభారతం - ఆదిపర్వము- 5-204)


ధనవంతునితో దరిద్రునికి, తత్త్వాన్ని తెలిసిన పండితునితో మూర్ఖునికి,  ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచాన్ని ధరించిన వానితో కవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? అని ప్రశ్నిస్తున్నాడు ద్రుపదుడు, ద్రోణుడిని. మానవ సంబంధాలలో లోక సహజమైన ఒక విధానాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, నన్నయగారు. ఇలా ఉండాలని కాదు కాని ఎలా ప్రపంచం "ఉన్నదో" ఆ స్వరూపాన్ని దర్శింప చేస్తున్నాడు. 

స్నేహితుడు కష్టాలలో ఉన్నప్పుడు అతనిని ఆదరించడం స్నేహధర్మం. ఆదరించక పోయినా ఎత్తిపొడుస్తూ అవమానించడం అతిశయానికీ గర్వానికీ ప్రతీకగా నిలుస్తుంది. తాను క్షత్రియుడననీ.. ఎదుటి వాడు బ్రాహ్మణుడని చెపుతూ "వర్ణాన్ని", స్వభావాన్నీ, అంతరాలను సభలో ఎత్తి చూపుతూ మిత్రుని మనస్సును చివుక్కుమనే విధంగా ద్రుపదుడు ప్రవర్తించాడు. ఏ మాత్రం అభిమానం కలిగిన వాడైనా ఆ మాటలకు బాధపడతాడు. పోలికలలో కూడా తనను తాను ఉత్తమునిగా (ధనపతిగా, తత్త్వవేత్తగా, ప్రశాంతునిగా, రణశూరునిగా, సురక్షితునిగా, సజ్జనునిగా) చెప్పుకుంటూ.. అధమ లక్షణాలను (దరిద్రునిగా, మూర్ఖునిగా, క్రూరునిగా, పిరికివానిగా, అరక్షకునిగా, దుర్మార్గునిగా) ద్రోణునికి ఆపాదించడం వల్ల పుండుపై కారం చల్లినట్లుగా కనిపిస్తుంది. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలన్న లోక సహజోక్తిని ఇక్కడ అన్యాపదేశంగా చెప్పడం గమనార్హం.

మహాభారతం ప్రకారం.. ద్రోణుడు శుక్రాచార్యుల అంశ.. కాగా ద్రుపదుడు వాయువు అంశ. భరద్వాజుడు ఘృతాచీని చూచిన సమయంలో జరిగిన రేతః పతనం వల్ల జన్మించిన వాడు.. ద్రోణుడు.. కాగా వృషతుడు మేనకను దర్శించిన సమయంలో జరిగిన రేతః పతనం వల్ల జనించిన వాడు, ద్రుపదుడు. వృషతుడు తన మిత్రుడైన భరద్వాజుని ఆశ్రమంలో ద్రుపదుని చేర్చి విద్యాభ్యాసం చేయించాడు. దానివల్ల ద్రోణునికి ద్రుపదునికి మధ్య గాడమైన మైత్రి ఏర్పడింది.. కాలాంతరంలో అటు వృషతుడు ఇటు భరద్వాజుడు మరణించడం.. కారణంగా ద్రుపద.. ద్రోణులు విడిపోయారు.. తన రాజ్యానికి వెళ్ళే సమయంలో ద్రుపదుడు.. ద్రోణునితో నీకే సమయంలో ఏ విధమైన అవసరం వచ్చినా నేనున్నానని మరచిపోకు.. పాంచాల దేశానికి ప్రభువునైన నా సహాయాన్ని నిస్సంకోచంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు.

తదుపరి ద్రోణుడు అగ్నివేశుని వద్ద విలువిద్యను అభ్యసించడం జరుగుతుంది. కృపుని చెల్లెలయిన కృపితో వివాహం జరిగి అశ్వత్థామ అనే కుమారునికి జన్మనిచ్చాడు. వేదవేదాంగాలూ నేర్చాడు, అస్త్రవిద్యలో ఆధిక్యాన్ని సాధించాడు.. అయినా అపరిగ్రహ వ్రతంతో (ఎవరి వద్దా దేనినీ తీసుకోననే) జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నాడు. కటిక పేదరికం వల్ల కనీసం కుమారునికి పాలుకూడా ఇవ్వలేని దుర్భరస్థితిలో లౌకిక జీవనం సాగేందుకై.. పరుశురాముడు దానధర్మాలు చేస్తున్నాడని తెలుసుకొని ఆతనిని ధనార్థియై ఆశ్రయిస్తాడు. అయితే అప్పటికే తన ధనాన్ని అంతా ఇతరులకు దానం చేసిన పరశురాముడు.. తనవద్ద అస్త్రశస్త్ర విద్యలు మాత్రమే ఉన్నాయని కావాలంటే వాటిని ఇవ్వగలనని చెప్పడం వాటినే అతడు కోరి పరశురాముని శిష్యరికంలో సాంగోపాంగంగా అన్ని యుద్ధ విద్యలను నేర్చుకుంటాడు.

అస్త్రం ఎప్పుడూ హింసనే కోరుకుంటుంది... బ్రాహ్మణునిగా తన వృత్తిని అనాదరించినా.. శస్త్రవిద్యను నేర్చిన అతనిలో.. ఆ భావ తీవ్రత కనిపిస్తుంటుంది. దానికి తోడుగా శుక్రాచార్యుల అంశ.. ప్రేరణనిస్తుంది. ఎన్ని విద్యలు నేర్చినా "కలనాటి ధనము లక్కర గలనాటికి" ఉపయుక్తం కాకపోతే ప్రయోజనం ఏమిటి? పేదరికం వెంటాడగా.. చిన్ననాటి మిత్రుడు.. ద్రుపదుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన చేసిన "బాసా" జ్ఞాపకం వచ్చింది. వెంటనే ద్రుపదుని పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు.. సభలో ద్రుపదుని దర్శించి తనను పరిచయం చేసుకొని.. అతని నుండి ఆశించిన ప్రతిస్పందనను కరవవడం వల్ల నేను నీ మిత్రుడనని జ్ఞాపకం చేస్తూ.. రెండావులను యాచించాడు. అది విన్న ద్రుపదుడు.. పరిహాస భావనతో చూచాడు.. పరుషమైన పదాలతో అవమానించాడు. రాజ్యాహంకారం దుశ్శీలత స్పష్టంగా కనిపిస్తున్నది, పై పద్యంలో..

ద్రోణుడు.. తాను పేదవాడే కాని దరిద్రుడు కాడు. సంపద లేకపోవడం పేదరికం.. సంపద లేకపోవడానికి తోడుగా ఆశ.. గుణహీనత కలిగియుండడం దరిద్రం.. అస్థిత్వానికి మూలాన్ని తెలుసుకోవడం తత్త్వజ్ఞత.. తెలిసిన దానిని ఆచరణలో పెట్టకపోవడం మూర్ఖత్వం... ప్రశాంతత.. స్థిత ప్రజ్ఞతకు ప్రతీక కాగా చాంచల్యత సంఘర్షణా మనస్సుకు ప్రతీక.. కార్య సాధనా శీలత.. సజ్జన లక్షణం కాగా పిరికితనం దుర్జన లక్షణం.. వీటిలో ఉత్తమ లక్షణాలను తనకు ఆపాదించుకొని అనుత్తమ లక్షణాలను ద్రోణునికి ఆపాదించడం వల్ల .. ద్రోణుని అభిమానాన్ని రెచ్చగొట్టి ప్రతీకారేఛ్ఛకు బీజం వేసాడు.. ద్రుపదుడు. "పొంగు క్రుంగు" లను సమంగా చూడగలిగిన ద్రోణుని వ్యక్తిత్వ పరిణతి.. అవమాన జ్వలితమై రగిలిపోయింది. తన శస్త్రాస్త్రబలంతో ద్రుపదుని ఎదిరించి.. పోరాడడం ఒక పద్ధతి.. అయితే తాను వచ్చింది యాచనకు.. ఇవ్వలేదనే కారణంతో చక్రవర్తిపై యుద్ధానికి సన్నద్ధమైతే.. తాను జయించవచ్చూ.. ఓడిపోనూవచ్చు.. ఏది లభించినా యుద్ధం వల్ల అత్యంత విలువైన మానవ వనరులు, ఆర్థిక వనరులు నాశనమౌతాయి. ఫలితం ఏదైనా  రాజ్య ప్రజలకు క్షోభనే మిగులుస్తుంది.  తన అవమానానికి మరింత ఆజ్యాన్ని అందిస్తుంది. అందుకే మౌనంగా వెళ్ళిపోయాడు. అప్పటివరకూ ద్రోణుడు క్షాత్రధర్మాన్ని స్వీకరించినా హింసను కోరకుండా బ్రాహ్మణ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు.

అయినా ద్రోణుడు శుక్రాచార్యుల అంశ.. కాబట్టి అవమానాన్ని మరచిపోలేదు.. ఆలోచించాడు.. కౌరవ సామ్రాజ్యం భీష్ముని రక్షణలో ఉన్నది. ఆ రాజ్యంలో రాజ కుమారులకు తన బావమరిది కృపుడు ఆచార్యకత్వం నిర్వహిస్తున్నాడు.. భీష్ముని ఆశ్రయిస్తే.. రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.. ఒకటి తన పేదరికం.. తొలగిపోతుంది.. రెండవది.. అవమానానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు.. తదనుగుణంగా కౌరవ సామ్రాజ్యంలో ధనురాచార్యునిగా చేరాడు.. గురు దక్షిణగా ద్రుపదుని ప్రాణాలతో పట్టి తెమ్మని శిష్యులకు పురమాయించాడు. అర్జునుడు ద్రుపదుని బంధించి ద్రోణుని ముందు నిలిపాడు.. "బ్రాహ్మణస్య క్షణం కోపం" అంటారు. ద్రుపదుని బంధించడంతో సంతృప్తి పడవచ్చు. కాని శ్రుక్రాంశ.. ఆగనీయదు.. ద్రుపదుని అవమానించాడు.. 

"వీరెవరయ్య? ద్రుపద మహారాజులె.. యిట్లు కృపణులయి పట్టువడన్ వీరికి వలసెనె.. యహహ! మహారాజ్య మదాంధకార మది వాసెనొకో!" అంటూ అవమానకరమైన మాటలతో పరిహసించి... ద్రుపదుని విడిచిపుచ్చుతూ.. మిత్రమా.. ఇప్పుడు నీ రాజ్యం అంతా నా వశమయింది.. అయినా మిత్రధర్మంగా గంగానదికి ఉత్తరంగా ఉన్న పాంచాల దేశాన్ని నీకు ఇస్తున్నాను.. దక్షిణభాగాన్ని నేను తీసుకుంటున్నాను వెళ్ళుమంటాడు.. దీనితో... ద్రోణుని ప్రతీకారేఛ్ఛ సమసిపోయినా.. ద్రుపదునిలో జనించింది.. తనను రెండావులను కోరి పరిహసించబడిన ద్రోణుని దాతృత్వం వల్ల తాను రాజ్యాన్ని పొందవలసి వచ్చింది.. ఆ అవమానం ద్రోణుని వధ లక్ష్యంగా దృష్టద్యుమ్నుని జననానికి కారణమయింది.. కురుక్షేత్ర యుద్ధంలో అది ఆవిష్కృతమయింది. 

  నిజానికి మహాభారతాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ప్రతి ప్రధాన పాత్ర జననానికి ఒక కారణం ఉన్నది. అవన్నీ చివరగా భూభారాన్ని తగ్గించే కార్యానికి ఉపకరణాలయ్యాయి.

 పాలకుర్తి రామమూర్తి

Friday, August 15, 2025

 అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద;

 

అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద; ఐదు నాల్గు మా

సమ్ములు మోసి గర్భమున, జన్మము నిచ్చి, ప్రసన్న మూర్తియై

రమ్మని జేర బిల్చుచు, శిరమ్ము నురమ్మున జేర్చి, స్పర్ష సౌ

ఖ్యమ్ముల దేర్చి, నిల్పి యొడి( నగ్గలమౌ యనుకంప నిండు చి

త్తమ్మున ముద్దు జేసి; అమృతత్త్వము ప్రేమయు క్షీర ధారలై

పమ్మగ స్తన్యమిచ్చి, మృదుభావ సుశబ్ద పరీమళమ్ము ప

ద్యమ్ముల పాటలన్ కథల నార్ద్ర వచస్సుల సౌరు జూప, శ్రా

వ్యమ్ముగ జోలబాడుచు; నిహమ్ము పరమ్మును జూపు విద్యలన్

గొమ్మని సుస్వరావళిని గూర్చి, తదీయ వికాస శోభ, పూ

ర్ణమ్ముగ పల్లవింపగ, సనాతన జీవన వైఖరుల్ సమా

జమ్మును వ్యక్తి బాధ్యతల సారము నా హృదయాంతరమ్ములం

దిమ్ముగ నిండ; నొజ్జయయి యెంతయు ప్రేమను బోధ జేయు మా

యమ్మకు మ్రొక్కెదన్; సతత మాత్మను జ్యోతిగ వెల్గునట్టి మా

యమ్మ; నవ ప్రఫుల్ల దరహాస మయూఖ వికాస మాలికా

సమ్మిళితాస్య దీప్తి, మనసా వచసా కరుణార్ద్ర పూర్ణ నే

త్రమ్ముల జాలువారెడు నిరంతర వత్సలతా ప్రవృత్తి, చే

తమ్మున నిత్య సత్య నిరత క్రమ  ధర్మ పథాను రక్తి, వా

క్యమ్ముల సంస్కృతీ రుచి సమాశ్రిత భావ సుధామయోక్తి, యా

యమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గ పా

దమ్ముల భక్తి నిష్ఠల సతమ్మును గొల్చెడి చిత్త వృత్తి, శా

స్త్రమ్ముల సార మన్వయము సల్పి హితమ్ముగ జాతి అజ్ఞతాం

ధ్యమ్మును బాపు జ్ఞాన రతి, తాత్త్విక చింతన లేకమై ప్రపం

చమ్మున శాంతి దాంతి పృధు సారము నింపగ నుద్యమించు మా

యమ్మ పవిత్ర పాదముల కర్మిలి మ్రొక్కెద; పాలకుర్తి వం

శమ్మున విజ్ఞతామతి, ప్రశాంతు డుదీర్ణ మనస్వియున్, సుగీ

తమ్ముల సర్వమంగళ యుదాత్త పదాబ్జ సమర్చనారతుం

డమ్మహనీయ భావనలహర్నిశలంచిత భక్తి తత్త్వ రా

జ్యమ్ము పదమ్ము జూపగ నహమ్ము నిహమ్మును మాని నిష్ఠ ని

త్యమ్మును తచ్ఛరిత్రములు ధ్యానము చేయుచు తన్మయుండునౌ

యమ్ముని సన్నిభుండు చరితార్ధుడు నౌ నరసింహరాము చి

త్తమ్ము వికాస దీప్తిగను తాత్త్విక చేతన శక్తి యౌచు భ

ద్రమ్ముగ వంశ గౌరవము రాజిల జేసిన తల్లి మా సుభ

ద్రమ్మకు మ్రొక్కెదన్; స్వర సుధా మధు వాహిను లార్ణవంబులై

నెమ్మది పొంగగా; సతత నిశ్చల నిర్మల మూర్తి యైన దు

ర్గమ్మ సభన్ మహాజనుల ప్రక్క సమంచిత పీఠి నాత్మ తే

జమ్మును ధీ విలాసము లజేయములై రహి మించ శ్లాఘనీ

యమ్ములు సారవంతములు నైన పదమ్ముల ముచ్చటించు మా

యమ్మ సుభద్ర పాదయుగ మాత్మను నిల్పి నమస్కరించెదన్!

పాలకుర్తి రామమూర్తి

 అసతోమా సద్గమయ,

తమసోమాజ్యోతిర్గమయ,

మృత్యోర్మా అమృతంగమయ (బృహదారణ్యకము 91.3.28)



 Oh God, please lead me from Untruth to Truth, please lead me from Ignorance to Illumination and please lead me from Mortality to Immortality....

The ultimate ambition of a human being should be to reach the destiny i.e. where he comes from.

The phenomenal world we perceive with our senses is only insentient. It is a gross part. It has a quality of composition and decomposition. So it is subject to destruction and over a period it vanishes. Therefore, it is said to be Unreal. Unreal or untruth is always non-existent. Our manifestation has taken place from un-manifestation, which is real or Truth and exists always. The truth is sentient and not gross or subtle. It has neither a beginning nor an end. So, we pray for the Ultimate to lead us to our birthplace which is real and unmanifest.

The wisdom of reality can be perceived only when our ignorance vanishes and enlightenment dawns. So, we pay the Ultimate to lead us from ignorance to illumination.

As the body is composed with five elements and over a period of time it vanishes. We call it death. Then all the five elements merge with the cosmic elements and we call it Mortality. Though the body disappears there is something which is immortal in our body, and it is called the Atman which is sentient. It is the manifestation of Ultimate and eternal. When we have such realisation, we pray to the Ultimate to lead us from mortality to immortality.

Realisation and attaining the state of eternity is the ultimate Goal of Human Life.

 భావవ్యక్తీకరణ ప్రాముఖ్యత


మహాభారతం జనమేజయునికి వైశంపాయనుడు చెప్పాడు. శ్రీశుకులు భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పాడు. ఒక నిర్వహణాధికారి తన క్రిందివారికొక పనిని చెప్పాడు. ఇలా ఎవరు ఎవరికి ఏది చెప్పినా దానిని భావవ్యక్తీకరణ అంటారు.. భావవ్యక్తీకరణ చెప్పినవారు (వక్త), సమాచారం, విన్నవారు (శ్రోత).. ఇలా మూడు స్థాయిలలో ఉంటుంది. ప్రభావవంతమైన భావవ్యక్తీకరణలో ముఖ్యమైనవి కూడా మూడు అంశాలే. చెప్పేవారికి వినేవారికి మధ్యనుండే సంబంధం, సమాచారం, సమాచారాన్ని అందుకున్నవారు దానిపై స్పందించిన విధానం. నిజానికి సమాచారాన్ని సరిగా అందించామా లేదా అనేది అవతలి వ్యక్తి దానిపై సరిగా స్పందించడంలోనే విదితమౌతుంది. ఇరువురికీ ఆసక్తి కలిగిన అంశంపై జరిగిన భావవ్యక్తీకరణ ఉత్తమ ఫలితాల నిస్తుంది. చెప్పిన వ్యక్తిలో అస్పష్టత, అసందర్భత వల్ల సమాచారం ఎదుటివారిలో ఆసక్తిని తగ్గించవచ్చు. అప్పుడు ఎదుటివారి స్పందన సరిగా ఉండకపోవచ్చు.
రామాయణంలో హనుమంతుడు మొదటిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు.. ఆత్మవిశ్వాసంతో, వినయంతో, తత్తరపాటు లేకుండా, సంక్షిప్తంగా, సందేహానికి తావులేకుండా, మధ్యమ స్వరంతో, సందర్భానికి అనువైన పదాలను ఎన్నుకొని సంస్కారవంతంగా తన మనసులోని మాటను స్పష్టంగా మృదుమధురంగా చెప్పాడు. మాట్లాడుతున్న సమయంలో ముఖంలో, కనులలో ఏ విధమైన వికారాలు కనిపించకుండా, సమయస్ఫూర్తితో మాట్లాడాడు, హనుమ. అలాకాక, వక్త ఆగిఆగి మాట్లాడడం, అర్థరహితంగా పదాలను విరిచి మాట్లాడడం, సాగదీస్తూ మాట్లాడడం, వేగంగా మాట్లాడడం, తొందరపాటుతో పదాలను ఉచ్చరించడం.. వినేవారిలో విసుగుకు కారణమౌతుంది.
భావవ్యక్తీకరణ అనేది.. మన దృష్టికోణాన్ని, ఆలోచనలను, భావనలను ఎంత ప్రభావవంతంగా ఎదుటివారికి చేరుస్తున్నామనేది తెలుపుతుంది. అలాగే వినడమనేది ఎదుటివ్యక్తి దృష్టికోణాన్ని, ఆలోచనలను, భావనలను ఎంత ప్రభావవంతంగా అవగాహన చేసుకుంటున్నామనేది తెలుపుతుంది. ఈ ప్రక్రియలో స్పష్టత లేనిచోట ప్రశ్నించడం, ఎదుటివారి దృష్టికోణాన్ని తెలుసుకోవడం వల్ల ఉత్తమమైన భావవ్యక్తీకరణ జరుగుతుంది. అవసరమైన చోట ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
భారతీయ సాహిత్యంలో ప్రశ్నోపనిషత్తు అనేపేరుతో ఒక ఉపనిషత్తే ఉన్నది. సరిగా ప్రశ్నించడం.. ఎదుటివారి పలుకుల కతీతంగా వారి హృదయాన్ని అవగాహన చేసుకోవడం ఉత్తమ సంభాషణకు ప్రతీకగా చెపుతారు. ఈ ప్రక్రియ సనాతన సంప్రదాయంలో గురుశిష్య సంభాషణలో కనిపిస్తుంది. లక్ష్యాన్ని నిర్వచించడంలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమంలో ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడం, సమయపాలనతో ముగించడం, వితండవాదాన్ని నివారించుకోవడం వల్ల వక్తకు శ్రోతకు మధ్య సదవగాహనతో కూడిన సంబంధాన్ని ఏర్పరచడం సాధ్యపడుతుంది.
రామాయణంలో హనుమంతుడు సీతను చూచాక వెనుతిరిగి తన సహచరులను కలుసుకున్న సమయంలో "దృష్ట్వాసీతా".. సీతను చూచాను అంటాడు. తక్కువ మాటలతో సహచరులందరికీ అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందించాడు. చాలా కాలంగా వారంతా అమితమైన ఒత్తిడికి లోనై, ఎంతో ఆసక్తితో, ఉద్వేగంతో హనుమ రాకకోసం ఎదురుచూస్తున్నారు. చూచాను అనడం వల్ల దేనిని చూచేందుకు వెళ్ళాడో దానిని చూచాడనే భావన వెల్లడయింది. కార్య సాఫల్యతను సూటిగా చెప్పడం వల్ల భావవ్యక్తీకరణ లక్ష్యం నెరవేరింది. సహచరులు కుతూహలం చూపితే వివరాలు చెప్పవచ్చు.
ఈనాటి సంస్కృతిలో కూడా భావవ్యక్తీకరణకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. తప్పుడు భావాలు అనుచరులకు చేరితే ఫలితాలు అసమంజసంగా రావచ్చు. కాబట్టి ఉత్తమ స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న నాయకులు సరైన సంభాషణా నైపుణ్యాలను సంతరించుకోవాలి.
పాలకుర్తి రామమూర్తి

 అందరికీ శుభ సాయంకాలం.

 
ఈ రోజు ఒక మిత్రుడు మాట్లాడుతూ మార్క్స్ "కాపిటల్" చదవకుండా ఈ ధరల్ని అర్థం చేసుకోవడం తేలిక కాదు అన్నాడు. దాన్ని అర్థం చేసుకోవడమనేది అంత లోతైన విషయమేమీ కాదనేది రోడ్డు ప్రక్కన మిర్చీ బడ్డీ పెట్టుకొని జీవనం సాగించే వ్యక్తికీ తెలుసు. 
అయితే ఈ నాటి గ్లోబలైజేషన్ విధానంలో వస్తువు విలువను రూపొందించాల్సిన విధానం భారతీయ సాహిత్యం ఎలా చెపుతుందో ఒకసారి చూద్దాం.

ఆర్థిక స్వావలంబనకు నాలుగు పార్శ్వాలుంటాయి. మొదటిది అమ్మకం ద్వారా మనం పొందిన డబ్బు.. దీనినే Price అంటాం. రెండవది ఆ వస్తువు తయారీకి మనం వ్యయించిన సొమ్ము... దీనినే Rate అంటాం. మూడవది ఆ వస్తు ఉత్పత్తికి మనం పెట్టిన శ్రమ.. దీనినే Value అంటాం. ఇక చివరిది.. మన ఖర్చులన్నీ పోను నికరంగా మనకు మిగిలే సొమ్ము... దీనినే Wealth అంటాం. ఇందులో ఎప్పుడు కూడా మొదటిది అంటే Price తగ్గించుకోవాలి. అప్పుడా వస్తువు అందరికీ అందుబాటులోకి వస్తుంది. అమ్మకాలు పెరుగుతాయి... Goodwill పెరుగుతుంది.. ప్రాచుర్యం పెరుగుతుంది. ఇక రెండవది అంటే Rate పెంచుకోవాలి. దీని వల్ల నాణ్యత పెరుగుతుంది. నాణ్యత వినియోగదారుని మన్ననలను పొందుతుంది. ప్రచారం పెరుగుతుంది. మూడవది అంటే Value అభివృద్ధి పరచాలి. దీని వల్ల నిరంతరం క్రొత్తదనం అన్వేషిస్తూ సాంకేతికతను అభివృద్ధి చేస్తాం. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో సమున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తిని సాధించే ప్రయత్నం చేస్తాం. దానితో ఉత్పాదకత పెరుగుతుంది. ఏ సంస్థలో నైనా ఈ ప్రక్రియ నిరంతరం  సాగిపోయినట్లయితే ఆ సంస్థ ఆర్థికంగా బలపడుతుంది. ఆర్థిక పునాదులు బలోపేతమైన సంస్థ ఉద్యోగుల అవసరాలను తీర్చగలుగుతుంది... సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతుంది. చుట్టూ ఉండే సమాజాన్ని ప్రగతి వైపు నడిపించ గలుగుతుంది. ఇక నాలుగవది.. Wealth ఆదాయం ఖర్చు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి యైనా లేదా సంస్థ యైనా సంతోషంగా ఉండగలుగుతుంది. నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. నలుగురుకి ఉపయుక్త మౌతుంది. సమాజంలో గుర్తింపు పొందుతుంది. కాని ఎప్పుడైతే ఆదాయం ఖర్చుకన్నా తక్కువైతే ఆ సంస్థ నిలవడమే ప్రశ్నార్థకమౌతుంది. ఉనికియే ప్రమాదంలో పడిన సంస్థ తన ఉద్యోగులకుగాని, ఖాతాదారులకుగాని ఏ విధంగా ఉపయోగపడదు. మిగులు సొమ్ము మన వద్ద ఎంత ఎక్కువగా ఉంటే అంత ధీమా….గౌరవం.
          ఈప్రక్రియలో మరో ముఖ్య కోణం ఏమిటంటే.. వ్యర్దాలను నియంత్రించడం... వ్యర్ధాలనెంత సమర్థవంతంగా నియంత్రణ చేసుకుంటే అంత అభివృద్ధి సంస్థలో కనిపిస్తుంది. ఎంత సమర్ధవంతుడైన యజమాని ఉన్నా, ఎంత చక్కని యోజనా ప్రణాళికలు వినియోగించినా...నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి సాధింపబడినా సమర్థులైన ఉద్యోగులు ఎంత అంకితభావంతో శ్రమించినా... అమ్మకాలు ఎంతగా పెరిగినా వ్యర్థ నియంత్రణ లేని సంస్థ నష్టాలలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. నష్టాలతో ఎవరూ సంస్థను నడపలేరు. సంస్థ నిలవక పోతే ఉద్యోగులకు ఉపాధిపోతుంది. అందువల్ల పరస్పరాధారిత విధానంలోనే ప్రయోజనం ఉంటుంది.
ఎవరెంత చెప్పినా వక్ర దృష్టి మారనంత వరకు వారు మారరనేది యదార్ధం. అలాంటి వారి దృష్టిని  ఆకర్షించేవి ఏమిటో కూడా ఒక కవి చాటువుగా చెప్పిన పద్యంతో ముగింపు పలుకుతున్నాను.
ఎవ్వతె వీవు కాళ్ళు మొగ మెర్రన; హంసను, ఏడ నుందువో?
దవ్వున మానసంబునను, దాన విశేషము లేమి తెల్పుమా?
మవ్వగు కాంచనాబ్జములు మౌక్తికముల్ గల వందు; నత్తలో?
అవ్వి యెరుంగ నన్న హహహా యని నవ్వె బకంబు లన్నియున్!

ఒక హంస ఒకనాడు దారి తప్పి ఒక మడుగు చేరిందట. అక్కడ కొన్ని కొంగలు ఉన్నాయి. తమ ఆకారానికి భిన్నంగా ఉన్న ఆ హంసను, దాని అందాన్ని, దాని సౌకుమార్యాన్నిచూచి ఈర్ష్య పడిన కొంగలు ఆ హంసను చుట్టుముట్టి అడిగాయట. "నీ వెవ్వరు నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉన్నాయేమిటి? హంస చెప్పింది తాను హంసనని. ఎక్కడుంటావని కొంగల ప్రశ్న... చాలా దూరంగా మానస సరోవరంలో ఉంటానని హంస జవాబు. అయితే అక్కడి విశేషాలేంటి... కొంగల ప్రశ్న.. అక్కడ అందమైన కోమలమైన ముత్యాలు మరియు బంగారు పుష్పాలుంటాయని చెప్పింది, హంస. కొంగలకు అది అర్థం కాలేదేమో అందుకే అడిగాయట... మరి అక్కడ నత్తలుంటాయా? అని. అప్పుడు తెల్లబోయిన హంస అవి (నత్తలు) నాకు తెలియదు అన్నదట. దానికి ఆ కొంగలన్నీ హహహా అని నవ్వాయట". చిన్నప్పుడు ఎప్పుడో విన్న చాటువు పద్యం.
పాలకుర్తి రామమూర్త

 జ్ఞానం అంటే ఏమిటి?


 జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే యదార్ధ స్థితిని గ్రహించడానికి మనలోని అంతశ్చేతన జాగృతిని పొందడమే జ్ఞానం. ఇది స్వయం స్పురణ వలన కలిగే ఒక అనుభవం లేదా దర్శనం. దీనినే అపరోక్షానుభవం అంటారు. ఇంద్రియ జ్ఞానం చేత తెలుసుకోబడేది పరోక్షానుభవం కాగా దానికి అతీతమైన ఒకానొక దివ్య భావన హృదయంలో ఆవిష్కృతం కావడం అపరోక్షానుభూతి. తర్కం చేత లేదా చర్చల చేత ఈ అనుభవాన్ని పొందడం దాదాపుగా అసాధ్యం. సమర్ధుడైన గురువు బోధన వల్ల ఆత్మ సమర్పణాభావనతో తెలుసు కోవాలనుకునే శిష్యుని జిజ్ఞాసలో ఆవిష్కృతమౌతుంది ఈ జ్ఞానం.

శ్రద్ధ నిష్ఠ కలిగిన వ్యక్తి యొక్క గ్రహణ శక్తి అపారమై జ్ఞానాన్ని గ్రహించడానికి సన్నద్ధ మౌతుంది. ఇక గురువు పరిణత మనస్కుడై, సాధనా చిత్తుడై వాత్సల్య భావనతో తత్వాన్ని అందించేందుకు సన్నద్ధుడైన వేళ ఆ జ్ఞానం ఒకరి నుండి ఒకరి హృదయాలలో (Presence to Presence) ఆవిష్కృతమౌతుంది. దీనినే మనం "ప్రాణాహుతి" అంటాము.

ఎప్పుడైతే నేర్చుకునే వాని నిష్ఠ అపరిమితమౌతుందో ప్రకృతి ఆ సాధకుని నిష్ఠకు, జిజ్ఞాసకు సరిపోయే జ్ఞానం కలిగిన పరిణత ఆత్మ ద్వారా ఆ విజ్ఞానం సాధకునికి చేరే ఏర్పాటు చేస్తుంది. జ్ఞానం ప్రయాణించాలి అంటే ఒక సాధనం కావాలి కాబట్టి అక్కడ గురువు అనబడే సాధనం కావాల్సి వస్తుంది. అందుకే గురువు వ్యక్తి కాదు అది ఒక మండలం అంటారు.

జిజ్ఞాసువు యొక్క నిష్ఠ అవసరమైన అపరోక్షానుభూతిని లేదా అనుభవాన్ని తనంతట తానుగా సమకూర్చుకునే యత్నంలో గురువు అనే సాధనం ద్వారా ప్రకృతి సాయపడుతుంది