Sunday, July 10, 2016

రాజకీయాలలో నైతిక విలువలు - నాడు నేడు
రాజకీయాలకు ఆరంభం ఎక్కడ? రాజ్యానికి సంబంధించింది రాజకీయం కనుక ఎక్కడైతే రాజ్యం ఉంటుందో అక్కడ రాజకీయం ఉంటుంది. ఈ రాజ్య వ్యవస్థ భారత దేశంలో ఎప్పుడు ఎక్కడ ఆరంభం అయింది అంటే మన పురాణాల ప్రకారం మనువు నాటి నుండి ఆరంభమయినట్లుగా తెలుస్తుంది. మనువు నాటికే సమాజం ఉంది.... ఆ సమాజంలో ఆధిపత్య పోరు ఉంది. బలవంతుడు బలహీనులను దోచుకునే సంస్కృతి ఉంది. ఆ సమాజంలోనూ ప్రజల మేలును పట్టించుకొని ఆ వైపుగా ఆలోచించిన వ్యక్తులు ఉన్నారు. సామాజిక దార్శనికు లైన అలాంటి వ్యక్తులంతా ఒక్క దగ్గరగా కూర్చొని తమ తమ ఆలోచనలను పంచుకొని సమాజం ఎలా ఉంటే ప్రజలంతా శాంతియుతంగా సహజీవనం చేయగలరో ఆలోచించారు. సమర్ధుడైన వ్యక్తిని గుర్తించారు, అతనికి పాలనా పగ్గాలను అందించారు. అతడే మనువు. ప్రజలంతా తమ ఆధీనంలో ఉన్న సంపదలో 10% అతని కిచ్చి పాలించమని కోరారతనిని. 
సాధారణంగా మన భారతీయ సంప్రదాయవాదులు మానవ జీవనం ఆరంభమయి కొన్ని లక్షల సంవత్సరాలు అయినట్లుగా చెపుతారు. కాని ఆధునిక వాదం దానిని ఒప్పుకోదు. మనువు పురాతన కాలానికి సంబంధించిన వానిగా సంప్రదాయవాదులు చెపుతున్నా ఆధునిక చరిత్రకారులు 200 BC కి సంబంధించిన వానిగా చెపుతున్నారు. ఏది ఏమైనా... తన కాలానికి సంబంధించిన సమాజానికి అవసరమైన స్మృతిని అందించిన వానిగా మనువును చెప్పుకోవాలి. 
కొన్ని లక్షల సంవత్సరాలుగా సాగుతున్న మానవ జీవనంలో మంచి చెడులు ఉన్నాయి. ప్రేమలు, ద్వేషాలు కనిపిస్తున్నాయి. ఆయా సమాజాలలో వాటిని సరిచేసేందుకు కృషిచేసిన వారూ ఉన్నారు. మానవ సమాజం చాలా పురాతనమైనదని... ఆ సమాజంలో కూడా బలవంతులు బలహీనులపై ఆధిపత్య ధోరణి కనపరచారని దానికి దేశాల ఎల్లలు లేవని తెలియచేసే సమాచారాన్ని క్రింద పొందుపరుస్తున్నాను.
(The Hindu daily news paper has published the following article on of 29th May, 2015 
Evidence of earliest murder comes to light
Lethal fractures preserved in an almost fully preserved early human skull indicate the earliest instance of murder in human history, some 4,30,000 years ago (Middle Pleistocene). 
The skull was recovered from an archaeological site Sima de los Huesos in northern Spain. 
The presence of two fractures of similar size and shape but running in two different directions on the frontal bone strongly suggests that the early human was killed when another member of his group stuck the skull twice using the same object. The fractures are present on the left side of the frontal bone suggesting that a right-handed member had stuck the skull during a face-to-face conflict.) 
మనువు తనపై ప్రజలంతా ఉంచిన నమ్మకానికి అనుగుణంగా తనదైన ఒక రాజ్యాంగాన్ని అదీ సమకాలీన పరిస్థితుల కనుగుణంగా వ్రాసుకున్నాడు. ఆనాటికే ప్రజలలో ఉన్న వృత్తులను అధ్యయనం చేసి ఆ యా వృత్తులను ఆచరించే వారిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణాలుగా విభజించాడు. (ఇవి వర్గాలు గాని కులాలు గానీ కావు… వర్ణాలు మాత్రమే) ఆధ్యయన ఆధ్యాపకత్వాలను నిర్వహిస్తూ సృజనాత్మకతకు మెరుగులు పెడుతూ ఆచరణాత్మకమైన విజ్ఞానాన్ని ప్రజావసరాలకు అనుగుణంగా ఆవిష్కరించేందుకు శ్రమించే వారిని బ్రాహ్మణులుగా పేర్కొన్నాడు. ఈ ప్రక్రియ అంతా మెదడుకు సంబంధించింది ఆ మెదడు తలలో ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు విశ్వమనే పురుషునికి తలగా (బ్రాహ్మణస్య ముఖమాసీత్) చెప్పాడు. అలాగే ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఎదుటి వారి కష్టానికి స్ఫందిస్తూ తోటి వారి రక్షణకు నిలిచి శ్రమించే వారిని క్షత్రియులు అన్నాడు. భుజాలు బలానికి, శక్తికి ప్రతీకలు కాబట్టి క్షత్రియులు విశ్వమనే పురుషునికి బాహువులుగా చెప్పారు. (బాహో రాజన్య కృతః) సంపద లేకపోతే అభ్యుదయం లేదు స్థిరత్వం లేదు. కాబట్టి సంపదను సృజించడం దానిని అవసరాల కనుగుణంగా వినిమయం చేయడం పట్ల ఆసక్తి కలిగిన వారిని వైశ్యులుగా చెప్పాడు (ఊరో తదస్య యద్వైశ్యః). దానినే వైశ్యులు విశ్వమనే పురుషునికి ఊరువులు (తొడలు .. స్థిరత్వాన్నిస్తావి) గా చెప్పడం జరిగింది. సమాజంలో ఉన్న వ్యక్తులలో పై మూడు వృత్తులలో ఇమడలేని వారిని లేదా ఆసక్తి లేని వారిని శూద్రులుగా చెప్పాడు (పద్యాగుం శూద్రో అజాయత). వీరు శ్రామికులే కాని నైపుణ్యం లేని వారు. అంతేకాక ఇతరుల సూచనల కనుగుణంగా పనిచేసే తత్త్వం కలిగిన వారు. పని చేయడంలో చలనం ఉంటుంది. పాదాలు చలనానికి ప్రతీకలు. తల ఆలోచనకు ప్రతీక కాగా పాదాలు కార్యాచరణకు ప్రతీక. సామాజిక అభ్యుదయానికి చేసే ప్రతి ఆలోచన రక్షణ కోణంలో వడగట్టబడి స్థిరత్వాన్ని సాధించి ఆచరణయోగ్యమై ఆచరించబడడంగా రూపొందించబడిన వర్ణ వ్యవస్థను రాజ్యాంగం చేసాడు, మనువు. మనువు చేత రూపొందించబడినది కాబట్టి దీనిని మను స్మృతి అన్నారు.
"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. విధి, నిషేధాల(మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి. మనకు తెలిసినంతలో స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి మను స్మృతి, అత్రిస్మృతి, విష్ణుస్మృతి, హరితస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ఉశానస్మృతి, ఆంగీరసస్మృతి, యమస్మృతి, ఆపస్తంబస్మృతి, సమ్వర్తస్మృతి, కాత్యాయనస్మృతి, బృహస్పతిస్మృతి, పరాశరస్మృతి, వ్యాసస్మృతి, శంఖస్మృతి, లిఖితాస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, శాతాతపస్మృతి, వసిష్టస్మృతి ఇవన్నీ అయా కాలాలలో ఆయా సామాజిక అవసరాల ననుసరించి సవరించ బడినవి లేదా మార్చి వ్రాయబడినవి. (కొందరు ఈ స్మృతులు ఇరువది ఎనిమిది అంటారు) కలి యుగంలో పరాశర స్మృతి (కలౌః పరాశరః)అనుసరణీయమని చెపుతారు. 
ఒక సమాజాన్ని మరొక సమాజానికి పోల్చి తప్పొప్పులు నిర్దారించడం సరియైన పద్ధతి కాదు. చరిత్రను మార్చలేము. ఆ చరిత్రను అలాగే చదువుకోని అందులో మంచిని (ఏమైనా ఉంటేనే) గ్రహించడం, సమ సమాజానికి ఆ మంచిని అందించడం వల్ల సంస్కృతి నిలబడడమే కాదు ఆ విజ్ఞానం సమాజానికి ఉపయోగ పడుతుంది కూడా. 
మనువు కాలం వరకు 50 వృత్తులలో ఉన్న వారిని గుర్తించి వారిని నాలుగు వర్ణాలుగా విభజించినా తదుపరి కాలంలో అవి కొన్ని వేల కులాలుగా మారి రాజకీయ విష నాగు పడగ క్రింద ఒక కులానికి మరొక కులానికి మధ్య విషాన్ని చిందించుకునే దౌర్భాగ్య స్థితిని ప్రసాదించాయి. దీనికి తోడు పరాయిపాలనలో మ్రగ్గడం, వారి సంస్కృతి ఆచార వ్యవహారాలకు బానిసలం కావడం వల్ల ఆ ఆలోచనా సరళిలో భారతీయ సంస్కృతి పట్ల ఏహ్య భావాన్ని పెంచుకోవడం, లోతుగా అధ్యయనం చేసే అలవాటుకు దూరం కావడం వల్ల భారతీయ సాహిత్య సంస్కృతులను పనికి రానివిగా భావించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇది చదువుకున్న “విజ్ఞానులు” తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యతిరేక ప్రచారాన్ని చేయడం వల్ల అవగాహన లేని వారికి దూరమౌతుంది. మరొక్క విషయం... వర్ణాన్ని కులంగా చిత్రీకరించడం వర్ణాన్ని వర్గంగా చిత్రీకరించడం వల్ల మూలాన్ని తప్పుగా చిత్రీకరణ చేయడం జరుగుతుంది. (ఇలా వ్రాయడం వల్ల మను ధర్మశాస్త్రాన్ని సమర్ధించడమో విమర్శ చేయడమో నా ఉద్దేశ్యం కాదు. తమకు తెలియకపోయినా ఎవరో ఎక్కడో ఉదహరించిన దానిని అది తప్పుడు ఉదాహరణ అయినా పరిశీలన చేయకుండా వర్ణాన్ని కులాలుగా చిత్రీకరిస్తూ తమ రచనల ద్వారా తప్పుడు సందేశాలిస్తున్న మిత్రులకు వారి ననుసరించే మిత్రులకు అవగాహన కోసం మాత్రమే వ్రాయడం జరుగుతుంది, వారి ఆలోచనా సరళి మారదని తెలిసినా.)
ఇకపోతే... ప్రతి సమాజానికీ విలువలతో కూడిన గమనం ఉంటుంది. ఆ సమాజం లేదా ఆ సమాజంలోని వ్యక్తులు వారి సమగ్ర జీవన విధానం ప్రాతిపదికగా ఏర్పరచుకొన్న విధి విధానలే ఆ సమాజపు విలువలు. ఆ సమాజానికి అనుగుణమైన వేష భాషలు, ఆహార విహారపు అలవాట్ల పట్ల ఆ సమాజంలోని వ్యక్తులు కొన్ని విలువలు ఏర్పరచుకొని ఆ విలువల ఆధారంగా జీవనం సాగిస్తుంటారు. అందుకే... విలువలు వ్యక్తుల ప్రవర్తన ప్రాతిపదికగా రూపొందుతాయి. ఆ ప్రవర్తనను శాసిస్తాయి. ఎప్పటి దాకా నైతే ఆయా సమాజాలలోని వ్యక్తులు తామేర్పరచుకొన్న విలువలకు బద్ధులై ఉంటారో అప్పటి వరకు ఆ సమాజం నీతి నియమాలతో అభ్యుదయం వైపు నడవడం కనిపిస్తుంది.
(శ్రీకాకుళం జిల్లాలో ఒక అటవీ ప్రాంతంలో ఒక గిరిజన బాలిక చదువు పేరుతో తన సంస్కృతికి దూరమై తామాపాదించుకున్న విలువలకు దూరమై ఒక నాగరకుడిని ప్రేమించింది. అది తప్పు కాదు. కాని ఆ ప్రేమికుడు మోసగించడం వల్ల ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎప్పటి వరకు తన సంప్రదాయాలకు ఆ సమాజ విలువలకు కట్టుబడి ఉన్నారో ఆ గిరిజన స్త్రీలు మోసపోలేదు. గిరిజన పురుషులూ స్త్రీలను మోసగించలేదు. ఒక్కసారి ఆ విలువలను వదలి వేసాక తాను మోసపోవడమే కాక చనిపోవడం జరిగింది.)
అనాది నుండి ఏ సమాజ చరిత్రను పరిశీలించినా లేదా పురాణాల పాత్రలను పరిశీలించినా నైతిక (నీతి నియమాల ననుసరించడం) విలువలతో కూడిన నేతల మార్గదర్శనలో ఆ సమాజం అభ్యుదయాధ్యంలో పయనించింది. ఏ సమాజంలో నైతే వ్యక్తులు "నాకోసం నీవేం చేస్తావని కాక నీ కోసం నేనేం చేయాలి" అని ప్రశ్నిస్తారో ఆ సమాజం విలువల ప్రాతిపదికన నడుస్తున్నట్లుగా భావించాలి. విలువలతో కూడిన రాజకీయ చైతన్యం అభ్యుదయం వైపు నడవాలి అంటే ఆ సమాజంలోని వ్యక్తులకు...
౧) విలువలతో కూడిన విద్యా విధానం అందించబడాలి
౨) ఆ సమాజ ఆర్థిక సంపత్తి అభ్యుదయం తో కూడిన కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయుక్తమవ్వాలి
౩) దార్శనికులైన నాయకుల నాయకత్వంలో సమాజంలోని ప్రతిపౌరుడూ తన కాళ్ళపై తాను నిలుచునేందుకు అవసరమైన ఉపాధి అవకాశాలను దానికి అవసరమైన వ్యూహాలను రచించుకో్గలగాలి
౪) ఆధ్యాత్మిక శక్తి వంతమైన సమాజంగా రూపొందగలిగిన మార్గ దర్శన కావాలి (ప్రతి వ్యక్తి జీవితం నాలుగు పార్శ్వాలుగా సాగుతుంది. మొదటిది భౌతికం.. రెండవది మానసికం... మూడవది భావోద్వేగ సంబంధితం... నాలుగవది ఆధ్యాత్మికం. భౌతికం అంటే శరీరం ఉంటేనే వ్యక్తికి అస్థిత్వం ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరం అంటే సరైన భౌతిక జీవనం కావాలి. ఇక మనస్సు ఉంటేనే ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. ఆలోచనల వల్లనే ప్రగతి, సుగతి సాధించ గలుగుతాము కాబట్టి ఆరోగ్యవంతమైన మనస్సు కావాలి. ఇక భావోద్వేగాలు లేని జీవనం రాయిరప్పల లాంటిది. ప్రక్కవారి కష్ట సుఖాలకు స్ఫందించ లేని వ్యక్తిగత జీవనం వల్ల ఏ సమాజమూ బాగుపడదు. కాబట్టి అవసరమైన మేర స్ఫందించగలిగిన భావోద్వేగాలు ప్రతి వ్యక్తిలో నిలవాలి. ఇక ఆధ్యాత్మిక జీవనం... అంటే ఈ మూడింటిలో సమగ్రత సాధించి అన్నింటినీ సమన్వయించి ఒకే త్రాటిపై నడప గలిగిన అంతర్గత చైతన్యం.) 
ఏ కాలంలో చూసినా వ్యక్తుల మానసిక స్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. మంచి చెడులు అన్ని కాలాలలో వ్యక్తులలో ప్రతిఫలించడం చరిత్రలో చూడవచ్చు లేదా పురాణాల పాత్రలలోనూ చూడవచ్చు. వ్యక్తులుగా మంచి వారయినా సమాజం చెడ్డదిగా మారడం కూడా మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నాగరకత కలిగిన దేశాలు రెండే రెండు... అంటాడు, స్పార్క్ అనబడే చరిత్రకారుడు. అవి భారత దేశం మరియు చైనా దేశాలు మాత్రమే. ఇందులో కూడా భారతదేశం తన సంస్కృతిలో సాహిత్యంలో పరిణతి చెందిన నాయకత్వాన్ని పలు సందర్భాలలో నిర్వచించింది. సమగ్రమైన తన దృష్టికోణం నుండి నాయకత్వాన్ని నిర్వచించే సందర్భంలో అయిదు ముఖ్యమైన లక్షణాలను గుర్తించి ఆ లక్షణాలను సంతరించుకున్న వారే నిజమైన నాయకులు కాగలరని చెప్పింది. అవి స్థూలంగా...
1) Global Mind set ... సర్వ కాలీన సర్వజనీనమైన సమగ్రమైన దార్శనికత
2) Extensive & Effective Communication network ...సమర్ధవంతమైన సమగ్రమైన సమాచార పంపిణీ వ్యవస్థను ఏర్పరచడం
3) Team building Competency .... వైవిధ్య భావాలు నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను జట్టుగా ఏర్పరచి ఆ జట్టును ఒకే లక్ష్యం వైపు నడిపించే సామర్ధ్యం
4) Conflict Management ..... జట్టులోని వ్యక్తుల మధ్య లేదా సమాజంలోని వ్యక్తుల మధ్య అసంకల్పితంగా లేదా సంకల్పితంగా నైనా ఏర్పడే సంఘర్షణలను నిర్వహించి, నివారించి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించడం
5) Trust Building ... నమ్మకం కలిగించడం ... నిజానికి వ్యక్తులు లేదా కుటుంబాలు కలసి ఉండేందుకు కావలసింది ప్రేమ కాని మరొకటో కాదు. ఆయా వ్యక్తుల మధ్య ఉండాల్సింది పరస్పర నమ్మకం మాత్రమే. నమ్మకమే కూటమిని సంఘటితంగా ఉంచగలుగుతుంది. నమ్మకమే పరస్పరాధారిత వ్యవస్థకు మూలమవుతుంది. 
భారత దేశ తాత్విక ఋషి సంతతి తరువాత గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌... అతని శిష్యుడు ప్లాటో... ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్‌ - ఈ ముగ్గురు మానవజాతికి తర్కించడం, విశ్లేషించడం, పరిశీలించడం... నేర్పిన తత్వవేత్తలుగా పేరొందిన వారు. ఈ సందర్భంలో నాయకత్వ విషయంలో గ్రీకు తత్వవేత్త ప్లాటో ఆలోచనా సరళిని ఒకసారి గుర్తుచేసుకోవడం ప్రయోజనకారి. Governance అనే పదం గ్రీకు భాషలో నుండి గ్రహింపబడింది. దానికి పరిపాలన అని తెలుగులో అర్థం చెప్పుకుంటున్నాము. నిజానికి Governance అనే పదానికి అర్థం సారథ్యం వహించడం. ప్లాటో మొదటిసారిగా ఈ పదాన్ని రూపకాలంకారం (Metaphorical) గా వాడారు. ప్లాటో ఉద్దేశ్యం ప్రకారం నాయకుడు లేదా పాలకుడు తత్త్వవేత్తయై ఉండాలి. ఏబది సంవత్సరాల వయసు దాటి ఉండాలి. కుటుంబ జంజాటం లేని వాడై ఉండాలి. నిస్వార్థంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి. 
అకాడమీ (మేధావులంతా మంచి ప్రభుత్వం ఏర్పాటుకు ఆలోచన చేసేదే అకాడమీ) ఏర్పాటు చేసి ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టాలనే విలువలతో కూడిన Commitment (నిబద్ధత) ఏ నాయకుడిలోనైతే ఆవిష్కృతమౌతుందో అతని సారధ్యంలో ప్రజలకు అభివృద్ధి సాధ్యపడుతుంది. ముందే చెప్పుకున్నట్లుగా అన్ని కాలాలలో అన్ని దేశాలలో నిబద్ధతతో కూడిన నాయకత్వాన్ని చూడవచ్చు ప్రజాకంటకులైన పాలకులను (అలాంటి వారిని నాయకులు అనకూడదు పాలకులనడమే సబబు) చూడవచ్చు. ఎన్ని విధాలయిన రాజ్యాంగాలు ప్రకాశంలో ఉన్నా ఈనాదు ఎక్కువ దేశాలు అనుసరిస్తున్నది ప్రజాస్వామ్యాన్నే. Democracy is a form of government in which people choose leaders by voting. అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యాన్ని (Democracy) నిర్వచిస్తూ It is a government of the people, by the people and for the people అంటాడు. (ప్రజలయొక్క, ప్రజల చేత ప్రజల కొరకు ప్రభుత్వము. అదే ప్రజాస్వామ్యం) అయితే ఈ వ్యవస్థలో ప్రజలు విద్యావంతులై, విజ్ఞానవంతులై మంచి చెడుల మధ్య విశ్లేషణ చేయగలిగిన ప్రజ్ఞాపూర్ణులై ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాకాని నాడు ఆ ప్రజాస్వామ్యం... పశువుల యొక్క, పశువుల చేత, పశువుల కొరకు మాత్రమే (Democracy without educated people is the country of the cattle, by the cattle and for the cattle) అని చెప్పుకోవాల్సి ఉంటుంది. 
సాధికారికంగా విశ్లేషించే తత్వం, ప్రశ్నించే తత్త్వం, అభివృద్ధిలో భాగస్వాములయే తత్త్వం ప్రజలలో నెలకొన్న వేళ ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది, ఆశించిన ఫలితాలిస్తుంది. దీనికి విలువలతో కూడిన నాయకత్వం కావాలి. కాని చాలా దేశాలు, దేశాధినేతలూ తమ స్వార్ధ ప్రయోజనాలకు విలువలను ఫణంగా పెట్టడం కనిపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ నివేదిక ప్రకారం ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉందని తెలుస్తుంది. ఈ దేశాలలో గమనిస్తే దాదాపు అన్ని దేశాలలోని రాజకీయ పార్టీలు తమ విలువలకు తిలోదకాలిచ్చాయి. రష్యా తన కమ్యునిస్ట్, సోషలిస్ట్ సిద్ధాంతాలను వెనిక్కి నెట్టివేసింది. చైనాకూడా WTO లో భాగస్వామ్యం తీసుకొంది. మన దేశంలోని కమ్యునిస్ట్ పాలిత రాష్ట్రాలు కూడా పెట్టుబడి దారుల భావనల వైపు ఆకర్శితులౌతున్నారు, వారిని ఆహ్వానిస్తున్నారు. రాజకీయ నాయకులు తమ పార్టీలు మారడం కనిపిస్తుంది. ఆదాయం కన్నా అధికంగా అక్రమమార్గంలో ఆస్థులు కూడబెట్టుకోవడం, డబ్బులు ఎరగా చూపి తమ పార్టీలకు ఓట్లేసే విధంగా ప్రలోభ పెట్టడం, భయపెట్టి తమకు మద్దతు కూడగట్టుకోవడం లాంటివి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. టి.డి.పి. యం.ఎల్.ఏ రేవంత్ రెడ్డి ఉదంతం దిగజారుతున్న రాజకీయ విలువలకు ఉదాహరణగ చెప్పుకోవచ్చు. ఒక పార్టీ టికెట్ తో గెలిచి మరొక పార్టీ లోకి మారి మంత్రులవడం కూడా రాజకీయ దిగజారుడు తనానికి ఉదాహరణయే. 
విలువలకు తిలోదకాలిచ్చే పార్టీలు ఆధిక్యత ప్రాతిపదికగా పాలనాధికారాన్ని చేపడితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. అందుకే అంటారు... In the country of blind one-eye man will be the king. 
అలాగని అందరు నాయకులను అవినీతిపరులుగా లేదా విలువలు లేని వారిగా చెప్పుకోవడం తప్పవుతుంది. ఒకనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు తన కూతురికి మందులు కొనలేని పరిస్థితులలో ఆమె మరణించడం, అతని మరణానంతరం అతని బాంక్ ఖాతాలో 300 రూపాయలు మాత్రమే ఉండడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు తను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కాలంలో కూడా సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్ళడం అతని విలువలతో కూడిన నిబద్ధతకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయన తనకు సంతానం ఉంటే స్వార్థం పెరుగుతుందనే ఆలోచనతో వివాహానికన్నా ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం ఆతని విలువల జీవితానికి ఉన్నత వ్యక్తిత్వానికి ప్రతీకగా చెప్పుకోవాలి. కలాం లాంటి నాయకుడు తమ జీవితాలను విలువలకు అంకితం చేయడం చరిత్రలో చూడవచ్చు.
ఇలా విలువలతో జీవితాలను సాగించిన నాయకులను, విలువలకు తిలోదకాలిచ్చి పశువుల గడ్డిని సైతం మేసిన నాయకులను ఎందరినైనా చూపవచ్చు. అయితే ఈ విలువలతో కూడిన సమున్నత నాయకత్వం కావాలి అంటే సమాజంలో ఉండ వలసిన విధానాలు ఏమిటి?
౧) విద్యా విధానంలో మార్పు రావాలి. బట్టీ పట్టే విధానం కాకుండా విశ్లేషణా పూర్వకంగా నేర్చుకునే విధానం అమలులో ఉండాలి. ఉదాహరణగా చెప్పుకుంటే... 2X2=4 అని విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇది బట్టీ పడుతున్నారు. దీనికి బదలుగా 2X2=4 ఎందుకవుతుంది 5 లేదా 3 ఎందుకు కాదు అనే ఆలోచన పిల్లలలో రేకెత్తే బోధనా విధానం అమలుకు వచ్చిన వేళ విద్యార్థిలో పరిణతి వస్తుంది. పరిణతి క్రొత్త మార్గాలను అన్వేషిస్తుంది... 
౨) పౌరులలో ప్రశ్నించే తత్త్వం రావాలి. దాని వల్ల పాలకులలో జవాబుదారితనం నెలకొంటుంది. 
౩) ఉపాధి అవకాశాలు ఎవరెవరి అర్హత ప్రాతిపదికగా వారికి దక్కాలి. ఏ రంగంలో అభిరుచి ఉంటే ఆ వ్యక్తిని ఆ రంగంలో నియమించ గలిగితే ఆ వ్యక్తి విలువలను సంతరించుకో గలుగుతాడు. 
౪) ప్రజ్ఞ గౌరవించ బడాలి. ఎప్పుడైతే ప్రజ్ఞావంతుడు అగౌరవం పాలవుతాడో అతని ప్రజ్ఞ నీరసపడి పోతుంది లేదా అపమార్గంలో (ఎక్కడైతే తనకు గౌరవం లభిస్తుందో అక్కడ) పయనిస్తుంది.
౫) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలలో చిన్నతనం నుండే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జీవించే విధానాన్ని బోధించాలి. వ్యక్తి కన్నా కుటుంబం, కుటుంబం కన్నా జాతి ముఖ్యమనే భావనను పిల్లలలో నింపగలగాలి. ఇక్కడ ప్రముఖమైన ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా పిల్లలు చెపితే నేర్చుకోరు. అనుకరిస్తారు... అనుసరిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందుగా తాము మారాలి, తమ నడతను మార్చుకోవాలి. దాని వల్ల పిల్లలు ప్రేరణ పొందుతారు.
౬) శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు, ఆధ్యాత్మిక స్వావలంబన పట్ల అవగాహన సమాజంలో పెరగాలి
౭) జీవితాంతం నేర్చుకునే విధానానికి ప్రతి ఒక్కరూ అంకిత మనస్కులై ఉండాలి.
పాలకుర్తి రామమూర్తి

No comments: