Wednesday, July 13, 2016

బోధించడం - నేర్చుకోవడం


గురువు బోధిస్తాడు, శిష్యుడు నేర్చుకుంటాడు. ఈ ప్రక్రియలో బోధన, నేర్చుకోవడం మాత్రమే లేవు. దీనిని పరిసరాలు, వాతావరణం, స్నేహాలు, శ్రద్ధ ఇలాంటి ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తావి. అన్నీ సమకూరినప్పుడే ఈ ప్రక్రియ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తుంది. గురువు బోధించినా ఒక్కొక్కప్పుడు శిష్యుడు నేర్చుకోలేక పోవచ్చు. గురువు చెప్పకపోయినా శిష్యుడు అనేక విషయాలు నేర్వనూ వచ్చు. గురువు అభ్యాసకుడుగా మారినప్పుడు మాత్రమే శిష్యుడిని ప్రభావితం చేయగలుగుతాడు, ప్రేరణ నివ్వగలుగుతాడు. ఎందుకంటే బోధన పరిమితమైనది కాగా నేర్వడం అపరిమితమైనది. ప్రేరణ ఆసక్తిని పెంచుతుంది. ఆసక్తి జిజ్ఞాసగా మారి ప్రశ్నను వేసుకుంటుంది, వేస్తుంది. ఆ ప్రశ్నించే తత్త్వమే సాంకేతికతకు మూలమౌతుంది. అయితే ప్రశ్నించడం ఎలా? దేనిని ప్రశ్నించాలి? ఎందుకని ప్రశ్నించాలి? ఈ విషయాలపై అవగాహన లేని నాడు ప్రశ్న అపేక్షిత ఫలితాన్నివ్వదు.
గురువు శిష్యునిలోని అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలనుకున్నప్పుడు ప్రశ్నించడం చేస్తాడు. ఆ ప్రశ్నలు భౌతిక, మానసిక, భావోద్వేగాలను స్పృషించే విధంగా ఉంటాయి. జవాబులు తానివ్వడు. జవాబులు రావాలని కూడా కోరుకోడు. వచ్చినా మంచిదే రాకపోయినా మంచిదే. శిష్యునిలో ఆలోచన రేకెత్తాలి. వివిధ కోణాలలో ఆలోచనలను విశ్లేషించుకొని ప్రతి పరిష్కారానికీ ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి అందులో ఉత్తమమైన దానిని ఆచరణలో పెట్టే విధంగా ప్రేరణ నిస్తాడు. ఆ ప్రయత్నంలో శిష్యుడు పొరబడి తప్పుచేస్తున్న సమయంలో లేదా ఆపదలో ఇరుక్కున్న సమయంలో అతనిని కాపాడే ప్రయత్నంచేస్తాడు. ఈ ప్రక్రియ ద్వారా శిష్యుని ఆత్మ విశ్వాసాన్ని పెంచడమే కాక శిష్యుని మార్గాన్ని నిష్కంటకం చేయడం కూడా (ప్రచ్ఛన్నంగా లేదా ప్రత్యక్షంగా) గురువు లక్ష్యంగా ఉంటుంది.
శిష్యుడు నేర్చుకుంటే అతనికే మంచిది లేదా నష్టపోయేదీ అతడే.
ఏకలవ్యుని బొటన వేలు కోరిన ద్రోణుడు దుర్మార్గునిగా చిత్రీకరిస్తారు కొందరు మేధావులు. ఆ మేధావులు భారతం జరిగింది అంటే ఒప్పుకోరు. ఎందుకంటే విదేశీ చరిత్రకారులు చెపితేనే అది వారికి వేదం.
అభివృద్ధి ఫలాలు అర్హత ప్రాతిపదికగా పంచబడితే ఆ సమాజంలో శాంతి నెలకొంటుంది. అనర్హత సాంకేతికతను ఆలంబన చేసుకుంటే అశాంతి రాజ్యమేలుతుంది.

No comments: