Friday, September 2, 2016

సాహిత్య మూలాలు-మూల్యాలు

వ్యక్తి జీవితాన్ని నాలుగు పార్శ్యాలలో చూడాలి. భౌతికం, మానసికం, భావోద్వేగ సంబంధం, ఆధ్యాత్మికం-వీటిని సమన్వయం చేసుకుంటూ సమగ్ర జీవన వికాసాన్ని పొందడంవల్ల సమాజంలో వ్యక్తి బాధ్యతను నిర్వహించిన వారవుతారు. సామాజిక ప్రయోజనం లక్ష్యంగా శాశ్వత సత్యాన్ని హితంగా చెబితే అది సాహిత్యం అవుతుంది. అందంగా చెబితే అది కవిత అవుతుంది.

సమాజానికి మార్గదర్శనం చేసే రచనలు దేశకాల పరిస్థితులను దృష్టిలో వుంచుకుని సమ సమాజ అభిరుచులు అనుభవాలు అవసరాలకనుగుణంగా సాగితే అవి కొంతకాలం నిలుస్తాయి. జాతీయత, భక్తి, కామన లాంటివి ఇతివృత్తాలుగా సాగిన రచనలలోని భావ వైవిధ్యం, భాషా సౌకుమార్యం, అనుభవపు లోతులు, ఉద్విగ్నత, ప్రాజ్ఞత, కథా కధన రీతులు, శిల్ప సౌందర్యం, అలంకారాది సోయగాలు ఎక్కువ మందితో చదివించి ఆనందాన్ని ఇచ్చినా...హేతుబద్ధత, దీక్షా దక్షతలు కొరవడిన వ్యూహాత్మకత సాధనా బలం మృగ్యమైన రచనలు సర్వజనీనం, సర్వకాలీనం కాజాలవు. సమాన భావకులైన కొందరా సాహిత్యానికి స్పందించి ఆదరించినా సామాన్యులా ఉద్యమ తీవ్రతకు లోనుగారు. ఒక జాతి లేదా దేశం అనుభవం ప్రపంచవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండకపోవడమే దీనికి కారణం. ప్రాచీన సాహిత్యంలోని భాషా ప్రౌఢిమ, అన్వయంలో క్లిష్టత, ఛందో నియమాలు...వీటివల్ల ఆ సాహిత్యం ఈనాటి పాఠకులకు దూరం అవుతుందనే భావన ఎక్కువగా ఉంది. ఎక్కువమంది సామాన్య స్థాయి పాఠకులు గలిగిన ఈనాడు అలాంటి రచనలు చదవవలసిన అవసరం ఉందా...అనేది ముఖ్యమైన ప్రశ్న. అలాగే భావ వ్యక్తీకరణకు భాషా ఛందస్సులు అడ్డుపడకూడదు వైవిధ్య భావ వ్యక్తీకరణకు ఉపయుక్తమయ్యేది భాష కాగా లయ ప్రధానమైనది ఛందస్సు. భాష నవనవోనే్మష భావచైతన్యానుభూతినిస్తుంది...నూతనత్వాన్ని సమకూరుస్తుంది. నీవు జీవించు ఎదుటివారిని జీవింపనివ్వు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నీకు రావాల్సిన దానిని అనుభవించు. ఎదుటివారిని దోచుకోకు, తాడిత పీడిత జనానీకం, దుఃఖబాధితులైన జీవకోటి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించే దిశలో ప్రయత్నించు. ఇలాంటివి సర్వకాలీన సర్వజనీనమైన సాహిత్యానికి మూలాలు...మూల్యాలు. రామాయణంలో...పరదార ధనాదులను కామించి నశించిన వాలి, రావణ పాత్రలు హింసాప్రవృత్తితో నశించిన ఖరదూషణాదుల పాత్రలు, రాచరికపు అహంకారాన్ని ధిక్కరించి దేశాన్ని విడిచిపెట్టిన విభీషణుడి పాత్ర భావ వ్యక్తీకరణ నైపుణ్యం కార్యసాధనా లక్షణాలు కలిగిన హనుమంతుని పాత్ర సర్వకాలీనమై నిలుస్తాయి. ప్రహ్లాద చరిత్రలో రాచరికపు అహంభావంతో లోక కంటకుడైన పాలకుని ధిక్కరించిన ప్రహ్లాద పాత్రను చూస్తే ఈనాడు అన్యాయాన్ని ఎదిరిస్తున్న ఉద్యమ నాయకుల పాత్రలకు ప్రతీక అనిపిస్తుంది.
భారతంలో ధర్మానికి ప్రతీకయైన ధర్మరాజు కనుసన్నలలో అర్ధ కామాలను సాధించుకున్న భీమార్జునులు కనిపిస్తారు. ఎన్ని హంగులు వ్యూహ రచనలు చేసుకున్నా అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవాళి ఓటమి పాలవడం సర్వకాలీనాంశం అవుతుంది. అవమార్గంలో నడిచే భర్తకు హితాన్ని ప్రవచించే తార, మండోదరి పాత్రలు, సహనానికి క్షమకు ప్రతీకలైన కుంతి. సమర్ధతకు ప్రతీకయైన ద్రౌపది లాంటి స్ర్తి పాత్రలు మనల్ని ఆలోచింప చేస్తాయి. సమభావన నశించిన మానవీయ విలువలు మసిబారి కులహంకారం కుబుసం విడిచినవేళ గళం విప్పిన జాషువా, స్ర్తి సమాజాన్ని బానిసలకన్నా హీనంగా చూస్తున్న సమాజంలో గురజాడ, కందుకూరి, లాంటివారి సాహిత్యం, జాత్యాహంకారాన్ని ఎదిరించిన గాంధీ, తాడిత పీడిత వర్గాల పక్క నిలిచి రచనలు సలిపిన శ్రీశ్రీ రచనలు, మూల్యాలు.. .మూలాలు, ధర్మ రక్షణ దీక్ష, సమ సమాజ స్థాపనా తపన, సమభావనా సౌజన్యతలు ఆయా పరిమితులలో లక్ష్య సాధనకై శ్రమించే జీవుని వేదనను ప్రతిబింబిస్తాయి. ఏది ఎలా ఉన్నా ఎన్నివాదాలు వినిపించినా సాహిత్యానికి మూలం ‘రసము’ జీవుని అంతరంగ వేదన రస వాహినిగా మారి అనుభూతిని ప్రసాదిస్తే ఆ అనుభూతి ఆర్తిగా తపనగా మారి అనుభవాన్నిస్తుంది. ఆ అనుభవం అక్షర రూపాన్ని సంతరించుకుంటే అది సాహిత్యమవుతుంది. మూల్యాలు లేని సాహిత్య మూలాలు చెదిరిపోతాయి. మూలాలు సరిగా లేని సాహిత్య మూల్యాలు తరిగిపోతాయి. అందుకే మానవీయ విలువల అనుభూతులు అనుభవాలు సంతరించుకున్న సాస్తియ రీతులకై తపిద్దాం.

No comments: