సంభవామి యుగే యుగే.... అన్నాడు గీతాచార్యుడు. చైతన్యం తమ సహజాతమైనా, జడత్వానికి ఆశ్రయమిచ్చిన జాతిలో స్పూర్తిని నింపి ఆ జాతి తేజాన్నినేల నాలుగు చెరగులా నింపేందుకు ప్రతి యుగం (కాలం) లో ఒక మహనీయుడు ఆవిర్భవిస్తూనే ఉన్నాడు. ఈ నాటి కాలంలో మన తెలుగు జాతిని చైతన్య పరచడానికి ఆవిర్భవించిన మహా మనీషి ... శ్రీ కాళోజీ గారు.
పోరుగడ్డ, ఉద్యమాలకు పుట్టినిల్లు యైన ఓరుగల్లు నానుకొని ఉన్న మడికొండ గ్రామంలో శ్రీ రంగారావు, శ్రీమతి రాంబాయి దంపతులకు 09-09-1914 లో జన్మించిన శ్రీ కాళోజీ 13-11-2002 లో తనువు చాలించారు. ఆయన బాల్యం అంతా మడికొండ గ్రామంలోనే గడిచిపోయింది. విద్యార్థి దశనుండే సంఘానికి తన జీవితాన్ని అంకితం చేసిన కాళోజీ జీవితంలోకి 1940లో శ్రీమతి రుక్మిణీ బాయి ప్రవేశించింది. శ్రీ కాళోజీ సహధర్మ చారిణిగా తన పదమూడవ యేట అడుగు పెట్టిన ఆయన సతీమణి 2013 లో తాను మరణించేంత వరకు సామాన్య జీవితాన్నే గడిపింది. ఆనాటి శ్రీ రాముని నుండి ఈ నాటి కాళోజీ వరకు ప్రజా జీవితంతో మమేకమైన వ్యక్తులను ఎవరిని తీసుకున్నా వారి సహధర్మచారిణు లందరూ కష్టాలతో సహజీవనం చేసినవారే. అందులోనే వారానందాన్ని పొందారు. తమ జీవిత భాగస్వాములకు ప్రేరణ నందించారు. ఆ వరుసలోనే రుక్మిణీబాయిగారు కూడా తాను కష్టాలతో సహజీవనం చేస్తున్నా తన భర్త మార్గంలో అవరోధం కాకుండా ఆయనకు స్ఫూర్తి ప్రదాతగానే నిలిచారు.
తన పదునైదవ ఏటి నుండే సంఘజీవిగా తనకంటూ ఒక గమ్యాన్ని ఏర్పరచుకున్న కాళోజీ తన జీవితాంతం ఉద్యమస్పూర్తితో సమాజాభివృద్ధి కోసమే పనిచేసాడు. ఆర్య సమాజ్ పట్ల ఆకర్శితుడైన కాళోజీ, తన చిన్నతనం నుండే అందులో క్రియాశీలక పాత్ర పోషించాడు. ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ఉత్సాహం ఊపిరిగా, ధైర్యం ఆలంబనగా, సాహసమే సహచరులుగా “అక్షర” ఉద్యమాన్ని నడపడం వల్ల అతడు ప్రజాకవిగా ప్రజల గుండెలలో నిలిచిపోయాడు. లక్ష్యం ఉదాత్తమైనది కాబట్టి తన గమనం కూడా సమున్నతంగా ఉండాలనే భావనతో "కాలానికి అతీతంగా, లోకాన్ని ఆలోకన చేస్తూ, జీవితాన్ని నిబద్ధతతో నడిపాడు" (కా..లో..జీ..). అందుకే ప్రజా జీవితాన్నే తన జీవితంగా మలుచుకున్న కాళోజీ తన మార్గంలో ఉద్యమించడానికి అవసరమైన రాజకీయం తనకు ప్రాణశక్తిగా... ఆ మార్గంలో సహకరించే ఊపిరులుగా కవితామార్గాన్ని ఎంచుకున్నాడు. అలాగని కవిత్వం తన అభిజాత్యాన్ని పెంచేదిగా ఉండ కూడదు.. కాబట్టే ఎన్నెన్నో ప్రసంగాలలో ఎన్నో కవితలను పచరించినా తానంటూ వాటికి అక్షర రూపాన్ని ఇవ్వలేదు. సహచరులు విని వాటికి అక్షరత్వాన్ని కలిగించడం వల్ల కొన్నైనా మిగిలాయి. రాశి కన్నా వాసి ముఖ్యం కదా. తన కన్నా ఆరు సంవత్సరాలు మాత్రమే పెద్దవాడయిన రామేశ్వర రావు గారు తన చిన్నతనం నుండి తన చివరి ఊపిరి వరకూ తన భౌతిక జీవన బాధ్యత తీసుకోవడం వల్ల సామాజిక కార్య క్రమాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించ గలిగాడు.
"ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్య వరాన్నిబోధత, క్షురస్య ధారా నిశితా దురత్యయాత్, దుర్గం పథస్తాత్ కవయో వదంతి" అంటూంది "కఠోపనిషత్తు". నీవెన్నుకున్నా మార్గం దుర్గమమైనది... కత్తి అంచుకన్నా వాడియైన దారి గుండా నీ ప్రయాణం సాగాలి. అత్యంత ప్రమాదకరమైన దారిలో ప్రయాణం సాగిస్తున్నప్పుడు అవసరమైన రీతిలో మానసికంగా సిద్ధంగా ఉండు. లే.. లేచి జాగరూకతతో స్థిరంగా నిలబడు. సన్నద్ధంగా ఉండు. ఏ క్షణాన నైనా అనివార్యమైన మృత్యువు నిన్ను కబళించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణం చేయవలసిన పనిని ఉత్తర క్షణానికి వాయిదా వేయకు.. అవకాశం మేరకు అవసరమైన దానికన్నా ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించు. బుద్ధితో విచారించు. శక్తి సామర్థ్యాలకు ఎప్పటి కప్పుడు పదును పెట్టుకుంటూ ఉద్యమ స్పూర్తితో పరాక్రమించు... అంటూ ప్రబోధిస్తుంది, ఉపనిషత్తు. అదే స్పూర్తిని తన అణువణువులో నింపుకున్న కాళోజీ... చావు పుట్టుకలు మన చేతిలో లేని ఈ ప్రపంచానికి కొద్ది రోజులు అతిథిగా వచ్చానని విశ్వసించిన వాడు కాబట్టి ఏ నాడూ తన కంటూ ఆస్తిపాస్తులను కూడబెట్టుకోలేదు... సంపాదించుకోనూ లేదు. అక్షర బద్ధమైన ఆయన జీవితం అక్షరమైనది (నాశనం లేనటువంటిది) అందుకే "చెలము చెలమలలో ఊట నీరు ఊరినంత కాలం ఈ గడ్డపై నేను బ్రతికే ఉంటా"నంటాడాయన. సుదీర్ఘమైన తన జీవిత కాలంలో కాళోజీ జీవితంలో రాజీ పడిన సందర్భాలను ఎన్నడూ చూడలేము.
జయప్రకాశ్ నారాయణ మరణంపై స్పందిస్తూ “పుటుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది” అంటాడు.
భాషా ప్రయుక్తమైన సమైక్య రాష్ట్రం తో ఇరు ప్రాంతాలూ (ఆంధ్రా తెలంగాణాలు) అభివృద్ధి చెందుతాయని మొదట విశ్వసించిన కాళోజీ సమైక్య రాష్ట్రం ఆవిర్భవించిన మరు క్షణం నుండే ఒప్పందాలను ఉల్లంఘించడం చూసి రగిలి పోయాడు. అందుకే "నా" నుండి "మా" దాకానే నేనింకా రాలేదు... "మన" అనుకున్నప్పుడు కదా ముందుకు సాగేది, అని అంటాడాయన.
1932 లో కోస్తా జిల్లావాసి అయిన ముడుంబై రాఘవాచార్యులు "తెలంగాణలో ఆంధ్ర కవులు పూజ్యం" అంటే దానికి జవాబుగా శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 354 మంది తెలంగాణా కవులను వారి వారి వివరాలనూ కవిత్వాలనూ గోల్కొండ పత్రిక ద్వారా పరిచయం చేసాడు. అహంకారంతో కూడిన ప్రాంతీయ భాషాభిమానానికి ఆత్మాభిమానంతో ఇచ్చిన జవాబది. అదే స్వాభిమానం కాళోజీలోనూ కనిపిస్తుంది.
వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణా నాది. వేరైనా నాది వీర తెలంగాణే అనే అంతటి గుండె ధైర్యం కలిగిన మనిషి ఆయన. ప్రాంతేతరులు దోపిడి చేస్తే తీరందాకా తరిమి కొట్టండి. ప్రాంతం వాడే దోపిడి చేస్తే... ప్రాణంతో పాతర పెట్టండి.... అనే సాహసం, అంతటి నిజాయతీ కలిగిన వ్యక్తులకు కాక ఎంత మంది కుంటుంది.
ఎవని వాడుక భాషలో వాడు రాయాలె అంటాడాయన. అయితే అది ఎదుటి వారికి తెలుస్తదా? అంటే తెలుసుకునే సహృదయత వారికుండాలి. మనలో ఉండే బానిస మనస్తత్వం వల్ల మనమే మన భాషను తక్కువ చేసుకుంటున్నాము. ఆ బానిస భావన పోవాలి. అంతే కాదు.... భాష రెండు రకాలు... ఒకటి... బడి పలుకుల భాష రెండవది... పలుకు బడుల భాష. మనకిప్పుడు కావలసింది... పలుకు బడుల భాష, అంటారాయన. అందుకే... తెలంగాణ భాషలో రాయండి... తెలంగాణ భాషలో మాట్లాడండి... తెలంగాణ బతుకు బతకండి అంటూ నినదిస్తున్నాడాయన.
సమగ్రాంధ్ర స్వర్ణోత్సవ సంబరాలను నిరసిస్తూ.. తెలంగాణ "యాస" నెపుడూ యీసడించు భాషీయుల సుహృద్భావన యెంతని వర్ణించుట సిగ్గుచేటు, అంటారాయన.
కాళోజీ గారు ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడంలో... వారి సోదరుడు, ప్రముఖ ఉర్దూ కవి శ్రీ రామేశ్వర రావు గారి ప్రభావం ఎంతో ఉంది.
కవితా స్వరూపాన్ని ముందుగా కవి తానుగా దర్శించి పాఠకులకు సాక్షాత్కరింప చేసే క్రమంలో తనలో కలిగే నాలుగు అవస్థలను అధిగమించాల్సి ఉంటుందని పాశ్చాత్య విమర్శకులు చెపుతుంటారు. అవి 1) Preparation (ప్రయత్నం) 2) Incubation (ప్రరోచనం) 3) Illumination (ప్రకాశనం) 4) verification (పరిశీలనం)
సామాజిక అనుభవాలను అంతర్ దృష్టితో అవలోకించి, సమ బుద్ధితో పరిశీలించి, నిర్మలమైన భావనలో ఆత్మానుభూతిని పొంది దానిని అక్షర బద్ధం చేసే విధానం కవిత్వానికి సర్వకాలీనతను ప్రసాదిస్తుంది. మనం చెప్పే విషయంలో ఎదుటి వారిని ఆకట్టుకునేందుకు వస్తువు ప్రధానమైన పాత్రను పోషించినా చెప్పే విధానం దాని కన్నా ముందుంటుంది. దీనికి ప్రతిభా వ్యుత్పత్తులతో పాటుగా అభ్యసనం కావాలి. సాధారణంగా ప్రతి వ్యక్తిలో రెండు శక్తులు ఉంటాయి ఒకటి పురుష శక్తి కాగా రెండవది స్త్రీ శక్తి. పురుష శక్తి ప్రతిభకు నిదర్శనం కాగా స్త్రీ శక్తి వ్యుత్పత్తికి ప్రతీక. ఒకటి సృజనాత్మతకు చోటిస్తే రెండవది అంగీకృతికి ఆధరువవుతుంది. ఈ రెండూ సమపాళ్ళలో ఉన్నప్పుడే ఆ కవిత సర్వకాలీనమై నిలుస్తుంది. నిరంతర అభ్యసన దీనికి మెరుగులు దిద్దుతుంది.
అయితే... అందులో బాస ఎంత ముఖ్యమో యాసా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సామాన్యుని జీవితాలను అసమాన్యంగా తీర్చిదిద్దాలనే తపన ఉన్న కవి వ్రాసే కవిత ఆ సామాన్యుడు పలికే యాసలోనే ఉండాలి... వాడు పలికే బాసలోనే ఉండాలి. సామాన్యుల వ్యధను ప్రతిబింబించే బాస వారి యాసలో ఉన్నప్పుడే అది లక్ష్యించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది.
ఒకసారి కరువు బంధనాలలో తెలంగాణ అల్లల్లాడిన వేళ "తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు కాని ఏ మూల చూసినా లెమెన్ జ్యూస్ లు, సోడాలు కనిపిస్తున్నాయని" కాళోజీ కవిత్వం రాసాడు. అది ఈ నాడూ మనకు కనిపిస్తూనే ఉంది. లెమెన్ స్యూస్ లు, సోడాల స్థానాన్ని మత్తుపానీయాలు, కూల్ డ్రింక్ లు ఆక్రమించాయి.
ఎనుబదెనిమిది సంవత్సరాల జీవన మహాప్రస్థానంలో ఆయన కలం జార్చిన జ్ఞాన వాహినులెన్నో... అధిగమించిన సోఫానాలు మరెన్నో.
ఎనిమిది సంపుటాలుగా సంపుటీకరింపబడిన "నా గొడవ" ఆయన ఆత్మ కథగా మనలకు ప్రబోధన అవుతుంది. అణా కథలు, పార్ధివ వ్యయం, కాళోజీ కథలు లాంటివి ఆయన ప్రతిభకు దర్పణాలుగా నిలువగా... బ్రెయిన్ ఫోర్డ్ వ్రాసిన రెబెల్ ఇండియా కు భారత దేశ యాత్ర పేరుతో చేసిన అనువాదం, ఖలీల్ జీబ్రా రాసిన ది ప్రాఫిట్ కు జీవన గీతాలు పేరుతో చేసిన అనువాదం పలువురు విమర్శకుల మన్నన లందుకోవడం జరిగింది. ఈ రచనకు 1968 లో ఉత్తమ అనువాద అవార్డ్ ప్రకటింపబడింది.
అలాగే... ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా. ఆంధ్ర ప్రదేశ్ సారస్వత పరిషత్ సభ్యునిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా, గ్లోజరీ కమిటీ సభ్యునిగా (1957-61) సేవ లందించిన కాళోజీని కాకతీయ విశ్వ విద్యాలయం 1992 లో గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.
ఆంధ్రపదేశ్ శాసన మండలి సభ్యునిగా (1958నుండి1960 వరకు) ఉపాధ్యాయుల ప్రతినిధిగా సేవలందించా రాయన. ఆయన సాహిత్య సామాజిక రంగాలలో అందించిన సేవలకు గౌరవంగా గుర్తింపుగా ఆయనను భారత ప్రభుత్వం 1992లో "పద్మవిభూషణ్" బిరుదుతో సన్మానించడం జరిగింది. ముక్కు సూటిగా వ్యవహరిస్తూ సన్మానాలకు దూరంగా ఉండే ఆయన నైజం తెలిసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ పి.వి. నర్సింహారావుగారు, ఆ పురస్కారానికి ఆయన ఒప్పుకుంటారో లేదో ముందుగా తెలుసుకోమని సూచించారంటే ఆయన వ్యవహరించే వ్యవహార సరళి ఎలాంటిదో తెలుస్తుంది.
ఆనాటి నిజాము పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగా నిజాం ప్రభుత్వంచే బంధీ కాబడ్డాడు. అలాగే స్వతంత్ర పోరాటం లో ఎన్నో మార్లు చెరసాలలకు పంపబడడం, అక్కడా తోటి ఖైదీలతో కూడి ఉద్యమించడం జరిగింది.
ఆయన జీవన విధానమే సిద్ధంతాల ప్రాతిపదికన ఏర్పడింది. విలువల కన్నా సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఎక్కువ. సిద్ధాంతాలు మనలోని అంకిత భావన నుండి వెలుగు చూసేవి కాగా విలువలు సమాజాంతర్గతమైనవి. సమత్వము, సమైక్యత, కలుపుకుపోయే తత్త్వము, నిబద్ధత లాంటి లక్షణాలు తన నొక ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టాయి. అయితే తన కిష్టం లేకపోయినా క్రమశిక్షణ పేరుతో ఏదో ఒక పార్టీ చెప్పినట్లుగా నడుచుకోవడం అతనికి గిట్టని విషయం. కాబట్టే అతను రాజకీయవాది యైనా ఏ పార్టీలో నిలదొక్కుకోలేక పోయాడు. కాకపోతే ఉద్యమ కారునిగా ప్రజల పక్షాన నిరంతరం పోరాడాడు. మానవ హక్కుల కై ఆయన చేసిన పోరాటం అతనిని తార్కొండే కమిటీ సభ్యునిగా చేసింది.
స్వతహాగా తెలుగులోనే కాక మరాఠీ, ఇంగ్లీశ్, ఉర్దూ భాషలలో ప్రావీణ్యాన్ని సాధించిన కాలోజీ న్యాయవాద పట్టాలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. విద్యతోనే ప్రశ్నించే తత్త్వం అలవడుతుందని నమ్మిన కాళోజీ 1930 లోనే గ్రంథాల యోద్యమం చేపట్టి ఊరూరా దాని ఆవశ్యకతను చాటాడు.
సత్యాగ్రహ ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల వందేమాతర ఉద్యమం, రజాకార్ల ఉద్యమం, 1969 తెలంణా ఉద్యమం లాంటి వాటిలో ఉత్సాహంగా తాను పాల్గొనడమే కాక ఎందరికో స్పూర్తినివ్వడం జరిగింది. నిజాం కారు మీద బాంబు విసరగలిగిన ధైర్యం ఆయనది. వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరవేసే ప్రయత్నం చేసినందుకు రజాకార్లు ఆయనకు నగర బహిష్కరణ శిక్షను వేసారు.
చివరకు తన పార్ధివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం వల్ల ఎందరికో మార్గ దర్శకు డయ్యాడు.
ఉద్యమే నహి సిధ్యంతి కార్యాణి న మనోరథైః
నహిసుప్తస్య సింహస్య ప్రవిషంతి ముఖే మృగా! అన్నారు.
ఉద్యమించనిదే (ప్రయత్నించనిదే) ఏ కార్య సాఫల్యతా సిద్ధించదు. అడవిలో సింహమైనా తన ఆహార సముపార్జనలో ప్రయత్నించాల్సిందే.
అలాంటి ఉద్యమ స్ఫూర్తిని తన జీవన రీతిగా మలుచుకున్న శ్రీ కాళోజీ నారాయణ రావు గారి స్మరణ యువతకు సరైన దిశను, దశను ఇస్తుందని విశ్వసిస్తూ....
ఎదురుగా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉండే సాక్షీభూతుడిని కాదు... సాక్షాత్తూ మానవుని నేను... అంటూ కర్తవ్యం వైపు నడిచే ధీమంతుడు కాళీజీ గారికి నివాళులర్పిస్తూ...
కృతజ్ఞతా నమస్సులతో....
పాలకుర్తి రామమూర్తి
పోరుగడ్డ, ఉద్యమాలకు పుట్టినిల్లు యైన ఓరుగల్లు నానుకొని ఉన్న మడికొండ గ్రామంలో శ్రీ రంగారావు, శ్రీమతి రాంబాయి దంపతులకు 09-09-1914 లో జన్మించిన శ్రీ కాళోజీ 13-11-2002 లో తనువు చాలించారు. ఆయన బాల్యం అంతా మడికొండ గ్రామంలోనే గడిచిపోయింది. విద్యార్థి దశనుండే సంఘానికి తన జీవితాన్ని అంకితం చేసిన కాళోజీ జీవితంలోకి 1940లో శ్రీమతి రుక్మిణీ బాయి ప్రవేశించింది. శ్రీ కాళోజీ సహధర్మ చారిణిగా తన పదమూడవ యేట అడుగు పెట్టిన ఆయన సతీమణి 2013 లో తాను మరణించేంత వరకు సామాన్య జీవితాన్నే గడిపింది. ఆనాటి శ్రీ రాముని నుండి ఈ నాటి కాళోజీ వరకు ప్రజా జీవితంతో మమేకమైన వ్యక్తులను ఎవరిని తీసుకున్నా వారి సహధర్మచారిణు లందరూ కష్టాలతో సహజీవనం చేసినవారే. అందులోనే వారానందాన్ని పొందారు. తమ జీవిత భాగస్వాములకు ప్రేరణ నందించారు. ఆ వరుసలోనే రుక్మిణీబాయిగారు కూడా తాను కష్టాలతో సహజీవనం చేస్తున్నా తన భర్త మార్గంలో అవరోధం కాకుండా ఆయనకు స్ఫూర్తి ప్రదాతగానే నిలిచారు.
తన పదునైదవ ఏటి నుండే సంఘజీవిగా తనకంటూ ఒక గమ్యాన్ని ఏర్పరచుకున్న కాళోజీ తన జీవితాంతం ఉద్యమస్పూర్తితో సమాజాభివృద్ధి కోసమే పనిచేసాడు. ఆర్య సమాజ్ పట్ల ఆకర్శితుడైన కాళోజీ, తన చిన్నతనం నుండే అందులో క్రియాశీలక పాత్ర పోషించాడు. ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ఉత్సాహం ఊపిరిగా, ధైర్యం ఆలంబనగా, సాహసమే సహచరులుగా “అక్షర” ఉద్యమాన్ని నడపడం వల్ల అతడు ప్రజాకవిగా ప్రజల గుండెలలో నిలిచిపోయాడు. లక్ష్యం ఉదాత్తమైనది కాబట్టి తన గమనం కూడా సమున్నతంగా ఉండాలనే భావనతో "కాలానికి అతీతంగా, లోకాన్ని ఆలోకన చేస్తూ, జీవితాన్ని నిబద్ధతతో నడిపాడు" (కా..లో..జీ..). అందుకే ప్రజా జీవితాన్నే తన జీవితంగా మలుచుకున్న కాళోజీ తన మార్గంలో ఉద్యమించడానికి అవసరమైన రాజకీయం తనకు ప్రాణశక్తిగా... ఆ మార్గంలో సహకరించే ఊపిరులుగా కవితామార్గాన్ని ఎంచుకున్నాడు. అలాగని కవిత్వం తన అభిజాత్యాన్ని పెంచేదిగా ఉండ కూడదు.. కాబట్టే ఎన్నెన్నో ప్రసంగాలలో ఎన్నో కవితలను పచరించినా తానంటూ వాటికి అక్షర రూపాన్ని ఇవ్వలేదు. సహచరులు విని వాటికి అక్షరత్వాన్ని కలిగించడం వల్ల కొన్నైనా మిగిలాయి. రాశి కన్నా వాసి ముఖ్యం కదా. తన కన్నా ఆరు సంవత్సరాలు మాత్రమే పెద్దవాడయిన రామేశ్వర రావు గారు తన చిన్నతనం నుండి తన చివరి ఊపిరి వరకూ తన భౌతిక జీవన బాధ్యత తీసుకోవడం వల్ల సామాజిక కార్య క్రమాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించ గలిగాడు.
"ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్య వరాన్నిబోధత, క్షురస్య ధారా నిశితా దురత్యయాత్, దుర్గం పథస్తాత్ కవయో వదంతి" అంటూంది "కఠోపనిషత్తు". నీవెన్నుకున్నా మార్గం దుర్గమమైనది... కత్తి అంచుకన్నా వాడియైన దారి గుండా నీ ప్రయాణం సాగాలి. అత్యంత ప్రమాదకరమైన దారిలో ప్రయాణం సాగిస్తున్నప్పుడు అవసరమైన రీతిలో మానసికంగా సిద్ధంగా ఉండు. లే.. లేచి జాగరూకతతో స్థిరంగా నిలబడు. సన్నద్ధంగా ఉండు. ఏ క్షణాన నైనా అనివార్యమైన మృత్యువు నిన్ను కబళించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణం చేయవలసిన పనిని ఉత్తర క్షణానికి వాయిదా వేయకు.. అవకాశం మేరకు అవసరమైన దానికన్నా ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించు. బుద్ధితో విచారించు. శక్తి సామర్థ్యాలకు ఎప్పటి కప్పుడు పదును పెట్టుకుంటూ ఉద్యమ స్పూర్తితో పరాక్రమించు... అంటూ ప్రబోధిస్తుంది, ఉపనిషత్తు. అదే స్పూర్తిని తన అణువణువులో నింపుకున్న కాళోజీ... చావు పుట్టుకలు మన చేతిలో లేని ఈ ప్రపంచానికి కొద్ది రోజులు అతిథిగా వచ్చానని విశ్వసించిన వాడు కాబట్టి ఏ నాడూ తన కంటూ ఆస్తిపాస్తులను కూడబెట్టుకోలేదు... సంపాదించుకోనూ లేదు. అక్షర బద్ధమైన ఆయన జీవితం అక్షరమైనది (నాశనం లేనటువంటిది) అందుకే "చెలము చెలమలలో ఊట నీరు ఊరినంత కాలం ఈ గడ్డపై నేను బ్రతికే ఉంటా"నంటాడాయన. సుదీర్ఘమైన తన జీవిత కాలంలో కాళోజీ జీవితంలో రాజీ పడిన సందర్భాలను ఎన్నడూ చూడలేము.
జయప్రకాశ్ నారాయణ మరణంపై స్పందిస్తూ “పుటుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది” అంటాడు.
భాషా ప్రయుక్తమైన సమైక్య రాష్ట్రం తో ఇరు ప్రాంతాలూ (ఆంధ్రా తెలంగాణాలు) అభివృద్ధి చెందుతాయని మొదట విశ్వసించిన కాళోజీ సమైక్య రాష్ట్రం ఆవిర్భవించిన మరు క్షణం నుండే ఒప్పందాలను ఉల్లంఘించడం చూసి రగిలి పోయాడు. అందుకే "నా" నుండి "మా" దాకానే నేనింకా రాలేదు... "మన" అనుకున్నప్పుడు కదా ముందుకు సాగేది, అని అంటాడాయన.
1932 లో కోస్తా జిల్లావాసి అయిన ముడుంబై రాఘవాచార్యులు "తెలంగాణలో ఆంధ్ర కవులు పూజ్యం" అంటే దానికి జవాబుగా శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 354 మంది తెలంగాణా కవులను వారి వారి వివరాలనూ కవిత్వాలనూ గోల్కొండ పత్రిక ద్వారా పరిచయం చేసాడు. అహంకారంతో కూడిన ప్రాంతీయ భాషాభిమానానికి ఆత్మాభిమానంతో ఇచ్చిన జవాబది. అదే స్వాభిమానం కాళోజీలోనూ కనిపిస్తుంది.
వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణా నాది. వేరైనా నాది వీర తెలంగాణే అనే అంతటి గుండె ధైర్యం కలిగిన మనిషి ఆయన. ప్రాంతేతరులు దోపిడి చేస్తే తీరందాకా తరిమి కొట్టండి. ప్రాంతం వాడే దోపిడి చేస్తే... ప్రాణంతో పాతర పెట్టండి.... అనే సాహసం, అంతటి నిజాయతీ కలిగిన వ్యక్తులకు కాక ఎంత మంది కుంటుంది.
ఎవని వాడుక భాషలో వాడు రాయాలె అంటాడాయన. అయితే అది ఎదుటి వారికి తెలుస్తదా? అంటే తెలుసుకునే సహృదయత వారికుండాలి. మనలో ఉండే బానిస మనస్తత్వం వల్ల మనమే మన భాషను తక్కువ చేసుకుంటున్నాము. ఆ బానిస భావన పోవాలి. అంతే కాదు.... భాష రెండు రకాలు... ఒకటి... బడి పలుకుల భాష రెండవది... పలుకు బడుల భాష. మనకిప్పుడు కావలసింది... పలుకు బడుల భాష, అంటారాయన. అందుకే... తెలంగాణ భాషలో రాయండి... తెలంగాణ భాషలో మాట్లాడండి... తెలంగాణ బతుకు బతకండి అంటూ నినదిస్తున్నాడాయన.
సమగ్రాంధ్ర స్వర్ణోత్సవ సంబరాలను నిరసిస్తూ.. తెలంగాణ "యాస" నెపుడూ యీసడించు భాషీయుల సుహృద్భావన యెంతని వర్ణించుట సిగ్గుచేటు, అంటారాయన.
కాళోజీ గారు ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడంలో... వారి సోదరుడు, ప్రముఖ ఉర్దూ కవి శ్రీ రామేశ్వర రావు గారి ప్రభావం ఎంతో ఉంది.
కవితా స్వరూపాన్ని ముందుగా కవి తానుగా దర్శించి పాఠకులకు సాక్షాత్కరింప చేసే క్రమంలో తనలో కలిగే నాలుగు అవస్థలను అధిగమించాల్సి ఉంటుందని పాశ్చాత్య విమర్శకులు చెపుతుంటారు. అవి 1) Preparation (ప్రయత్నం) 2) Incubation (ప్రరోచనం) 3) Illumination (ప్రకాశనం) 4) verification (పరిశీలనం)
సామాజిక అనుభవాలను అంతర్ దృష్టితో అవలోకించి, సమ బుద్ధితో పరిశీలించి, నిర్మలమైన భావనలో ఆత్మానుభూతిని పొంది దానిని అక్షర బద్ధం చేసే విధానం కవిత్వానికి సర్వకాలీనతను ప్రసాదిస్తుంది. మనం చెప్పే విషయంలో ఎదుటి వారిని ఆకట్టుకునేందుకు వస్తువు ప్రధానమైన పాత్రను పోషించినా చెప్పే విధానం దాని కన్నా ముందుంటుంది. దీనికి ప్రతిభా వ్యుత్పత్తులతో పాటుగా అభ్యసనం కావాలి. సాధారణంగా ప్రతి వ్యక్తిలో రెండు శక్తులు ఉంటాయి ఒకటి పురుష శక్తి కాగా రెండవది స్త్రీ శక్తి. పురుష శక్తి ప్రతిభకు నిదర్శనం కాగా స్త్రీ శక్తి వ్యుత్పత్తికి ప్రతీక. ఒకటి సృజనాత్మతకు చోటిస్తే రెండవది అంగీకృతికి ఆధరువవుతుంది. ఈ రెండూ సమపాళ్ళలో ఉన్నప్పుడే ఆ కవిత సర్వకాలీనమై నిలుస్తుంది. నిరంతర అభ్యసన దీనికి మెరుగులు దిద్దుతుంది.
అయితే... అందులో బాస ఎంత ముఖ్యమో యాసా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సామాన్యుని జీవితాలను అసమాన్యంగా తీర్చిదిద్దాలనే తపన ఉన్న కవి వ్రాసే కవిత ఆ సామాన్యుడు పలికే యాసలోనే ఉండాలి... వాడు పలికే బాసలోనే ఉండాలి. సామాన్యుల వ్యధను ప్రతిబింబించే బాస వారి యాసలో ఉన్నప్పుడే అది లక్ష్యించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది.
ఒకసారి కరువు బంధనాలలో తెలంగాణ అల్లల్లాడిన వేళ "తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు కాని ఏ మూల చూసినా లెమెన్ జ్యూస్ లు, సోడాలు కనిపిస్తున్నాయని" కాళోజీ కవిత్వం రాసాడు. అది ఈ నాడూ మనకు కనిపిస్తూనే ఉంది. లెమెన్ స్యూస్ లు, సోడాల స్థానాన్ని మత్తుపానీయాలు, కూల్ డ్రింక్ లు ఆక్రమించాయి.
ఎనుబదెనిమిది సంవత్సరాల జీవన మహాప్రస్థానంలో ఆయన కలం జార్చిన జ్ఞాన వాహినులెన్నో... అధిగమించిన సోఫానాలు మరెన్నో.
ఎనిమిది సంపుటాలుగా సంపుటీకరింపబడిన "నా గొడవ" ఆయన ఆత్మ కథగా మనలకు ప్రబోధన అవుతుంది. అణా కథలు, పార్ధివ వ్యయం, కాళోజీ కథలు లాంటివి ఆయన ప్రతిభకు దర్పణాలుగా నిలువగా... బ్రెయిన్ ఫోర్డ్ వ్రాసిన రెబెల్ ఇండియా కు భారత దేశ యాత్ర పేరుతో చేసిన అనువాదం, ఖలీల్ జీబ్రా రాసిన ది ప్రాఫిట్ కు జీవన గీతాలు పేరుతో చేసిన అనువాదం పలువురు విమర్శకుల మన్నన లందుకోవడం జరిగింది. ఈ రచనకు 1968 లో ఉత్తమ అనువాద అవార్డ్ ప్రకటింపబడింది.
అలాగే... ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా. ఆంధ్ర ప్రదేశ్ సారస్వత పరిషత్ సభ్యునిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా, గ్లోజరీ కమిటీ సభ్యునిగా (1957-61) సేవ లందించిన కాళోజీని కాకతీయ విశ్వ విద్యాలయం 1992 లో గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.
ఆంధ్రపదేశ్ శాసన మండలి సభ్యునిగా (1958నుండి1960 వరకు) ఉపాధ్యాయుల ప్రతినిధిగా సేవలందించా రాయన. ఆయన సాహిత్య సామాజిక రంగాలలో అందించిన సేవలకు గౌరవంగా గుర్తింపుగా ఆయనను భారత ప్రభుత్వం 1992లో "పద్మవిభూషణ్" బిరుదుతో సన్మానించడం జరిగింది. ముక్కు సూటిగా వ్యవహరిస్తూ సన్మానాలకు దూరంగా ఉండే ఆయన నైజం తెలిసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ పి.వి. నర్సింహారావుగారు, ఆ పురస్కారానికి ఆయన ఒప్పుకుంటారో లేదో ముందుగా తెలుసుకోమని సూచించారంటే ఆయన వ్యవహరించే వ్యవహార సరళి ఎలాంటిదో తెలుస్తుంది.
ఆనాటి నిజాము పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగా నిజాం ప్రభుత్వంచే బంధీ కాబడ్డాడు. అలాగే స్వతంత్ర పోరాటం లో ఎన్నో మార్లు చెరసాలలకు పంపబడడం, అక్కడా తోటి ఖైదీలతో కూడి ఉద్యమించడం జరిగింది.
ఆయన జీవన విధానమే సిద్ధంతాల ప్రాతిపదికన ఏర్పడింది. విలువల కన్నా సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఎక్కువ. సిద్ధాంతాలు మనలోని అంకిత భావన నుండి వెలుగు చూసేవి కాగా విలువలు సమాజాంతర్గతమైనవి. సమత్వము, సమైక్యత, కలుపుకుపోయే తత్త్వము, నిబద్ధత లాంటి లక్షణాలు తన నొక ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టాయి. అయితే తన కిష్టం లేకపోయినా క్రమశిక్షణ పేరుతో ఏదో ఒక పార్టీ చెప్పినట్లుగా నడుచుకోవడం అతనికి గిట్టని విషయం. కాబట్టే అతను రాజకీయవాది యైనా ఏ పార్టీలో నిలదొక్కుకోలేక పోయాడు. కాకపోతే ఉద్యమ కారునిగా ప్రజల పక్షాన నిరంతరం పోరాడాడు. మానవ హక్కుల కై ఆయన చేసిన పోరాటం అతనిని తార్కొండే కమిటీ సభ్యునిగా చేసింది.
స్వతహాగా తెలుగులోనే కాక మరాఠీ, ఇంగ్లీశ్, ఉర్దూ భాషలలో ప్రావీణ్యాన్ని సాధించిన కాలోజీ న్యాయవాద పట్టాలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. విద్యతోనే ప్రశ్నించే తత్త్వం అలవడుతుందని నమ్మిన కాళోజీ 1930 లోనే గ్రంథాల యోద్యమం చేపట్టి ఊరూరా దాని ఆవశ్యకతను చాటాడు.
సత్యాగ్రహ ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల వందేమాతర ఉద్యమం, రజాకార్ల ఉద్యమం, 1969 తెలంణా ఉద్యమం లాంటి వాటిలో ఉత్సాహంగా తాను పాల్గొనడమే కాక ఎందరికో స్పూర్తినివ్వడం జరిగింది. నిజాం కారు మీద బాంబు విసరగలిగిన ధైర్యం ఆయనది. వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరవేసే ప్రయత్నం చేసినందుకు రజాకార్లు ఆయనకు నగర బహిష్కరణ శిక్షను వేసారు.
చివరకు తన పార్ధివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం వల్ల ఎందరికో మార్గ దర్శకు డయ్యాడు.
ఉద్యమే నహి సిధ్యంతి కార్యాణి న మనోరథైః
నహిసుప్తస్య సింహస్య ప్రవిషంతి ముఖే మృగా! అన్నారు.
ఉద్యమించనిదే (ప్రయత్నించనిదే) ఏ కార్య సాఫల్యతా సిద్ధించదు. అడవిలో సింహమైనా తన ఆహార సముపార్జనలో ప్రయత్నించాల్సిందే.
అలాంటి ఉద్యమ స్ఫూర్తిని తన జీవన రీతిగా మలుచుకున్న శ్రీ కాళోజీ నారాయణ రావు గారి స్మరణ యువతకు సరైన దిశను, దశను ఇస్తుందని విశ్వసిస్తూ....
ఎదురుగా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉండే సాక్షీభూతుడిని కాదు... సాక్షాత్తూ మానవుని నేను... అంటూ కర్తవ్యం వైపు నడిచే ధీమంతుడు కాళీజీ గారికి నివాళులర్పిస్తూ...
కృతజ్ఞతా నమస్సులతో....
పాలకుర్తి రామమూర్తి