Friday, October 28, 2016

రథ సారథి కర్తవ్యం (Responsibility of the Managing Director)

రథ సారథి కర్తవ్యం
(Responsibility of the Managing Director)
సారథి దక్షుడై, రథిక సారము, రథ్య బలంబు, నాయుధో
దారత, మానమున్, రణ విధంబు, నిమిత్త శుభాశుభత్వ ని
ర్ధారణ మున్, మదిం గని హితం బెఱిగించుట నీతి గాన నీ
వీరస మెత్తి నో బలికి తేనియు చెప్పుదు, సూత నందనా!
(శ్రీమదాంధ్ర మహాభారతము ..  కర్ణ పర్వము, ద్వితీయాశ్వాసము- ౫౨)

ఓ కర్ణా! నీ మనస్సు లో వీర రసం ఉప్పొంగడం చేత, ఉన్న యదార్ధ రీతిని చెప్పినా, నీవు చెవిని చేర్చడం లేదు. అయినా సారథిగా నా అవగాహనలో ఉన్న విషయం నీకు చెప్పడం నీతి కాబట్టి చెపుతున్నాను.... అంటూ శల్యుడు ఇలా చెపుతాడు.
రథికుని నైపుణ్యాన్ని, గుర్రాల యొక్క జవసత్వాలను, రథం లో ఉన్న ఆయుధ సంపత్తినీ, రథికుని యొక్క విలువలు మరియు సిద్ధాంతాలు, యుద్ధం ఎలా నడుస్తుంది, అంతే కాక ఎదురౌతున్న శకునాల ననుసరించే ఫలితాలు అన్నీ పరిశీలించి మంచి చెడ్డలు చెప్పడం ఉత్తమమైన దక్షుడైన సారథిగా నా కర్తవ్యం కాబట్టి చెపుతున్నాను, అంటాడు.
దీనిని ఈ నాటి మార్కెట్ కు అన్వయించుకుంటే.....
ఒక సంస్థ నిలదొక్కు కోవాలి... తన విజయం  చరిత్ర పుటల్లో నమోదు కావాలి... భావి తరాలకు ఆదర్శప్రాయం కావాలి అంటే ఆ సంస్థ సంపాదించుకో వలసిన, సమీకరించుకోవలసిన లక్షణాలను పరోక్షంగా తెలుపుతుందీ పద్యం.
సారథి దక్షుడై .... సారధి (Managing Director)... ఆ సంస్థను నడిపించే వ్యక్తి  దక్షుడై ఉండాలి, సంబంధిత రంగం లో నైపుణ్యాన్ని కలిగియుండాలి, అన్ని విభాగాల పై కనీస అవగాహన ఉండాలి... కార్య సాధకుడై ఉండాలి, త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగిన వాడై ఉండాలి, భయం పక్షపాతం లాంటి వాటికతీతుడై ఉండాలి, బృందం తో కలసి పని చేయ గలిగి ఉండాలి... బృందాన్ని నడిపించ గలిగి ఉండాలి. బుద్ధి తో ఆలోచించి అవసరమైన చోట తల్లి/తండ్రి (పేరెంట్) గా, పెద్దాయన (అడల్ట్)గా, చిన్న పిల్లవాడి (ఛైల్డ్) గా వ్యవహరిస్తూ ఒక్కొక్క మారు లాలించ గలగాలి ఒక్కొక్క మారు కఠినంగా వ్యవహరించ గలిగి ఉండాలి.
రథిక సారము.... రథికుడు (Chairman - Management) దూరదృష్టి, యోజనా పటిమ, ప్రతిభను గుర్తించగలిగిన వికాసం, దైర్యం, మనో నిగ్రహం, నైపుణ్యం, భావోద్వాగాలపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యం కలిగియుండాలి. విస్తృత పరిశీలనా శక్తి కలిగి యుండాలి. ఎదుటి వారి వ్యూహాలను పసిగట్ట గలగడం, తగిన రీతిలో వేగంగా స్ఫందించ గలిగిన ధీ పటిమ యుండాలి. ఆ యా రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం.. దానికి తగిన రీతిలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోగలిగిన విధానం తెలిసి ఉండాలి. ఆ మార్పులను అంగీకరించే మానసిక చైతన్యం కలిగి ఉండాలి. అనుయాయులతో, వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండాలి. బృందాన్ని ఏర్పాటు చేయగలగడం, ఆ బృందం లోని సభ్యులందరూ ఒకే లక్ష్యం తో కలసి ఒకే ఆలోచనా విధానం తో పని చేసేందుకు అవసరమైన స్ఫూర్తిని నింపగలగడం, సమస్యలెదురైన వేళ వాటి నధిగమించేందుకు ప్రణాళికా బద్ధం గా ముందు చూపుతో వ్యవహరించ గలగడం, ప్రో ఆక్టివ్ గా యుండడం, హేతుబద్ధ ఆలోచనా పటిమ... తోటి వారిని గౌరవించే నైజం, ఎదుటి వారి సలహాలను సకారాత్మకంగా తీసుకునే లక్షణాలు ఉండాలి. ఆర్థిక, సామాజిక, మేధో బలం కలిగిన వాడై యుండడం వల్ల అతని సమర్థత గౌరవించబడి.. అనుయాయులు అతనిని నమ్మదగిన వ్యక్తిగా గుర్తిస్తారు... అనుసరిస్తారు... సహకరిస్తారు... అనుమోదిస్తారు.
రథ్య బలంబు.... రథ్య బలము (Men, Machinery & Morality) ఉత్తము లైన, ఆలోచనాపరులైన, సంస్కారవంతులైన, కష్టపడి పని చేయగలిగిన వారు, సంస్థ అభివృద్ధియే తమ అభివృద్ధిగా తలచే వారు ఉద్యోగులుగా... ప్రతిభ ఆధారం గా నియమింప బడాలి. అన్నివిభాగాలలో పరస్పరాధారిత స్ఫూర్తి తో పని చేయగలిగిన ఉద్యోగులు సంస్థకు వెన్నెముక లాంటివారు. సంబంధిత రంగం లో అవసరమైన శిక్షణ పొంది ఆ అనుభవం ప్రాతిపదికగా అంకిత భావం తో పనిచేసే ఉద్యోగులు సంస్థ ప్రగతిలో ముందుంటారు. అలాగే అధునాతన యంత్ర సామాగ్రి, అవసరమైన విడిభాగాలు అందుబాటులో ఉండడం వల్ల ఉత్పత్తి కుంటుపడదు.. ఉత్పత్తి ఉత్పాదకతలు పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తం గా వస్తున్న మార్పుల నాధారం చేసుకొని ఎప్పటి కప్పుడు యంత్ర సామాగ్రిని ఆధునీకరించుకోవడం వల్ల పరిశ్రమలో ముందుండడం సాధ్యపడుతుంది. క్రొత్త ఆవిష్కరణలు, క్రొత్త విధానాలు.. అమ్మకాలను పెంచుతాయి... ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తాయి... అమ్మకపు ఖర్చులను తగ్గిస్తాయి... వెరసి నికర ఆదాయం పెరుగుతుంది. విలువలు, సిద్ధాంతాల ఆధారంగా పనిచేయడం, పాలనా వ్యవహారాలలో పారదర్శకత వల్ల ఉద్యోగులు - సంస్థ మధ్య సంబంధాలు దృఢమౌతాయి. అదే విధానాన్ని సంస్థ సంస్కృతిగా కొనసాగించడం, క్లయింట్లు మరియు సప్లయర్స్ తో వ్యవహరించడం వల్ల వ్యాపార సంబంధాలు పటిష్ఠ మౌతాయి.
ఆయుధోదారత...  ఆయుధోదారత (Qualitative and Quantitative Resources & Instruments) వనరుల సమీకరణ సరిపోయేంతగా ఉండాలి. ఎక్కడ ఏ లోపం రాకూడదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన మేరకు నాణ్యమైన ముడిపదార్ధాలను సేకరించి పెట్టుకోవడం.. విడిభాగాలను సరఫరా చేసే సంస్థల తో అనుబంధాన్ని పెంచుకోవడం... అవసరమైన మేరకు సరఫరా ఒప్పందాలను కుదుర్చుకోవడం... వినియోగదారులతో సత్సంబంధాలను కలిగి యుండడం, స్నేహబంధాన్ని కొనసాగించడం లాంటివి మనలను ఉన్నత స్థానం లో నిలుపుతాయి.
మానమున్... మానము (Credibility) పరిశ్రమలో పరపతి పెంచుకోవాలి. ఏ ఇచ్చిపుచ్చుకునే లావాదేవీ వల్లనైనా వినియోగదారునికీ అమ్మకం దారుకూ ఇరువురికీ ఉపయోగపడే ఒప్పదం కుదరాలి అలాంటి ఒప్పదం కుదుర్చుకోవడం వల్ల ఇరువురి ప్రయోజనాలు సిద్ధిస్తాయి.  నీకు జయం నాకూ జయం (Win/Win Attitude) వైఖరి వల్ల ఇరువురూ లాభపడతారు... ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ ఒప్పదం కుదరక పోయినా వారి మధ్య బంధం చెడిపోదు.  సరైన సమయానికి మనం ఇవ్వవలసిన చోట బిల్లులు చెల్లించడం వల్ల సరఫరాదారు మనల్ని ఉత్తమ ఖాతాదారునిగా గుర్తిస్తాడు. మన పట్ల ఉదారం గా వ్యవహరించే అవకాశం ఉంది. న్యాయబద్ధం గా సరకుకు విలువ కట్టడం, సరైన నాణ్యత, సరైన కొలత, సరైన సమయానికి, సరైన ధరకు సరకు ను వినియోగదారునికి అందించడం వల్ల మన పరపతి పెరుగుతుంది. సరఫరాదారుడు, వినియోగ దారుడు... ఇరువురి నమ్మకం సంతృప్తి చూరగొన్న ఏ సంస్థ యైనా ఉన్నత శిఖరాల నధిరోహిస్తుంది.
రణ విధంబు... రణ విధానము (Planning, Organising, Processing, Review, Introspection,  Restucturing and Implimentation) ముందుగా ఏ పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఎక్కడ చేయాలి, దానికి ఏ యే వనరులు ఎంత మొత్తం లో అవసరమౌతాయి, ఆయా వనరుల నెలా సమీకరించుకోగలం, దానికి నైపుణ్యం గలిగిన ఉద్యోగులు లభిస్తారా, యంత్ర పరికరాలు ఎక్కడ లభిస్తాయి, ప్రభుత్వ అనుమతులు ఎలా వస్తాయి, ఈ విధానం లో పరిశ్రమ నెలకొల్పడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతడబ్బు అవసరమౌతుంది, భాగస్వాములు లభిస్తారా, వినియోగ దారుల మార్కెట్ ఎలా ఉంది, మన పోటిదారుల వ్యాపారం ఎలా ఉంది, పరిశ్రమ స్థాపనలో మన బలాబలాలు ఏమిటి, మార్కెట్ ను ఎలా స్వాధీన పరచుకో గలం అనే అన్ని విషయాలపై సరైన అవగాహనతో కూడిన యోజనా ప్రణాళిక తయారు చేసుకోవాలి. మనకున్న అన్ని వనరులనూ సమీకరించుకోవాలి. ప్రతిభ ఆధారం గా అనుచరులకు బాధ్యతలప్పగించాలి. నిజాయతీ పరులను కీలక పదవులలో పెట్టి వారికి అర్హులైన శిక్షణ పొందిన సహాయకులను నియమించాలి. నాణ్యత గలిగిన యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి నిర్వహణా బాధ్యతను సంబంధించిన వారికి నిర్ణయాధికారాలతో సహా అప్పగించాలి. అవసరమైన సమయం లో ఏం జరుగుతుంది అనుకున్న ఫలితాలు వస్తున్న యా లేదా ఏ యే విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి.. ఎయే విభాగాలలో ఏయే సమస్యలున్నాయి... అనె విషయాన్ని సమగ్రంగా విశ్లేషించి వీలైనంత త్వరగా దానిని సరిచేయాలి. ఆత్మ పరిశీలన ద్వారా మన పని తీరును సరి చూచుకోవాలి. అవసరమైన చోట ఏయే మార్పులు చేర్పులు అవసరమో పరిశీలించి ఆయా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల సంస్థ పని తీరు ఉత్తమం గా ఉంటుంది.
నిమిత్త శుభాశుభత్వ నిర్ధారణమున్.... (Ascertaining Good and Bad by Observing the Market trends) శకునాలు .... మార్కెట్లో కనిపించే సూచనల కనుగుణం గా ఏది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది దేని వల్ల నష్టపోతామో గ్రహించడం, ఏ నాణ్యతా ప్రమాణాలతో ఏ వస్తువు ఎక్కడ అమ్మగలమో.. ఎక్కడ మన ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో... వినియోగదారుల మనసు గెలిచేందుకు మన ఉత్పత్తుల ప్రమాణాలలో ఇంకా ఏ విధమైన మార్పులు చేయాలో...ఎక్కడ మన కవసర మైన ముడి సరకులు తక్కువ ధరకు దొరుకుతాయో... ప్రభుత్వ విర్ణయాలు మన ఉత్పత్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి... వాటి వల్ల ఉపయోగమా నష్టమా లాంటి వివిధాంశాలను ఎప్పటి కప్పుడు సర్వే చేయించడం... వల్ల అవసరమైన మార్పులు వేగం గా తీసుకు రావడం వీలవుతుంది. మార్కెట్ లో ముందుండాలి అంటే సమాచార వ్యవస్థ ను మెరుగుపరుచు కోవాలి. మన వినియోగదారుని ప్రలోభాలతో లొంగ తీసుకునే పోటీదారులను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మన సంస్థ లో లంచగొండి ఉద్యోగులు, స్వలాభం చూచుకునే భాగస్వాముల గూర్చిన సమగ్ర సమాచారం ఎప్పటి కప్పుడు మనకు చేరవేయ గలిగిన గూఢాచార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధానాలలో సూచనలు అందిన సమయానికి స్ఫందించని ఉత్పత్తిదారుడు నష్టపోతాడు.
హితం బెఱిగించుట (Advising & Mentoring) హితము చెప్పడం... అభ్యుదయ మార్గం లో సాగాలని కోరే ప్రతి సంస్థ లో సాంకేతిక, ఆర్థిక, వ్యాపార, న్యాయ సంబంధిత అంశాలపై సరైన సూచన లిచ్చేందుకు ఒక నిపుణుల సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలి స్వతంత్రం గా వ్యవహరిస్తూ అధినేతకు మాత్రమే జవాబు దారి కావాలి. అయా అంశాలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ... అన్ని సూచనలను పరిగణన లోకి తీసుకుంటూ సంస్థ ప్రగతికి ఏ విధానం మంచిదో ఆ సలహా మండలి తెలియచేయడం మంచిది. ఆ సూచనల నాదరించి అందులోని సాధ్యాసాధ్యాలను పరిగణలోనికి తీసుకొని అధినేత నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అధినేత పరిమితుల కారణంగా ఆ సూచనలు పాటించక పోయినా, విషయమెంతటి సున్నితమైనదైనా, నీచ మైనదైనా, అధినేతకు విన్నవించడం ఆ సలహా మండలి కర్తవ్యం. తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని శాస్త్రీయం గా విశ్లేషించి ఆ పరిశీలన సారాన్ని ఉపపత్తిగా చూపుతూ ఏ దారి మంచిదో యుక్తమైనదో దానిని అధినేత కు నివేదించడం వారి కర్తవ్యం. అయితే అందులో తమ స్వార్థపూరిత అభిప్రాయాలకు తావివ్వవద్దు. ఆ సలహా మండలికి ఉద్యోగులను నియమించే సమయం లోనే నిజాయతీ పరులను, నమ్మకస్తులను, అనుభవజ్ఞులను ఎన్నుకోవడం అధినేత విధి.

పాలకుర్తి రామమూర్తి

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః......

ఓం శ్రీ సరస్వత్యైనమః

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా! (దుర్గా సప్తశతి)
భావము:
హే దుర్గా మాతా! నిన్ను స్మరించిన మాత్రముననే అశేష ప్రాణి కోటి భయాలను మూలాలతో కూడా హరిస్తావు. ఎవరైతే నిన్ను నిరంతరం స్మరిస్తూ, తమ హృదయాలలో అత్యధిక భక్తితో ధారణ చేస్తారో, నిశ్చలంగా నిలుపుకుంటారో అలాంటి వారికి శుభాభ్యుదయాలను అశేషంగా అనుగ్రహిస్తావు. స్వస్వరూపాన్ని గ్రహించకుండా మానవులను అడ్డుకునే దారిద్ర్యము, దుఃఖము, భయములనబడే మాయావరణాలను దూరం చేసేందుకు నీకన్నా అన్యులు ఎవరున్నారు తల్లీ! ఎల్ల వేళలయందు దయాభరిత చిత్తంతో సకల సహాయసంపత్తి నందచేసేందుకు అవసరమైన సర్వ ఉపకరణాలను అందుబాటులో ఉంచుకొని సిద్ధంగా ఉండే హే దుర్గా మాతా నీకు నమస్కారములు.

వ్యాఖ్య:
దుర్గముడు అనే రాక్షసుడిని జయించడం చేత పరాత్పరికి దుర్గ అనే పేరు వచ్చింది. ఏదైతే గమింపరానిదో దానిని దుర్గమము అంటాము. ప్రతివ్యక్తి తనకు తెలిసి కాని తెలియక కాని ఏదో ఒకటి సాధిస్తాడు. అది మనకు సాధ్యమయింది అనుకుంటాము. చాలామంది అక్కడితో సంతృప్తి చెందుతారు. మనశక్తి యుక్తులను కొద్దిగా విస్తరించగలిగితే మరింత ఉన్నత ఫలితాలను సాధిస్తాము. దానిని మన సామర్ధ్యము (Capability) అంటాము. ఆ సామర్ధ్యము కొన్ని పరిమితులలో విస్తరిస్తుంది కాని అపరిమితంగా విస్తరించుకోగలిగిన శక్తిసామర్ధ్యాలు ప్రతి వ్యక్తియందు నిక్షిప్తమైయున్నాయి. దానిని potentiality అంటాము. దుర్గమమైన లక్ష్యాలను సాధించేందుకు మనలోని అపరిమిత శక్తి సామర్ధ్యాలను (potentiality) గుర్తించి వినియోగించుకోవలసి ఉంటుంది. దుర్గముడు అనే రాక్షసుడిని ప్రతీకగా చెపుతూ మనలో అంతర్నిహితంగా ఉన్న అపరిమిత శక్తి సామర్ధ్యాలను (potentiality) గుర్తించి వినియోగించుకోవలసిన ఆవశ్యకతను ఈ నామం ద్వారా ప్రబోధ చేస్తున్నారు.
"ఉత్తిష్ఠత, జాగృత, ప్రాప్యవరాన్నిబోధత; క్షురస్యధారా నిశితాదురత్యయాత్, దుర్గం పథస్తాత్ కవయోవదంతి" అంటుంది, కఠోపనిషత్.  నీ లక్ష్యం దుర్గమమైనది. పదునైన కత్తి అంచు కన్నా నిశితమైనది నీవు గమించవలసిన దారి. "సాధ్యమూ" "సాధన"లు సులువైనవి కావు. అలాంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే దృఢమైన సంకల్పం కావాలి. అందువల్ల (ఉత్తిష్ఠత) ప్రకాశవంతంగా లేచి నిలబడు, ప్రభావ వంతంగా లేచి నిలబడు, స్థిరత్వాన్ని సాధించు. జాగృత... మేలుకో... అంటే... నిద్ర లేవడం కాదు. మనసు జాగృతం కావాలి. ఈ జగత్తులో (జాయతే గచ్చతే జగత్) మనం ఎవరమూ శాశ్వతం కాదు. ఏ క్షణమైనా మనమీ జగత్తు నుండి వెళ్ళవలసి రావచ్చు కాబట్టి ఈ నాడు చేయవలసిన ఏ పనినైనా క్షణం కూడా వాయదా వేయవద్దు. ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా ధైర్యాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా సాహసంతో నీ గమ్యం వైపు గమించ గలిగిన జాగృతి కావాలి. చరిత్రలో ఎన్నో జీవరాసులు పుడుతూ గతిస్తూ ఉంటాయి. (ఈ జగత్తులో చావుపుట్టుకలు సహజం కనుక) అలా కాక కొద్ది మంది మాత్రమే తమ జీవన ప్రయోజనం (Purpose) ఏమిటి? దానిని ఏ విధంగా సాధించాలి? సాధించే క్రమంలో మన ప్రతిభావ్యుత్పత్తులను (Performance) నిరంతరం మెరుగు పరుచుకోవడం ఎలా? అని ఆలోచిస్తారు; ఆ వైపు శ్రమిస్తారు. ఎంతటి దుర్లభమైన, దుర్గమమైన లక్ష్యాన్నయినా సాధిస్తారు, ఛేదిస్తారు. అలాంటివారే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.ఆ సాధనాక్రమంలో అవసరమైన జ్ఞానాది వనరులను సమకూర్చుకునేందుకై విజ్ఞులు, జ్ఞానులు, పరోపకారపరాయణులైన నిర్మలాత్ములైన మహానుభావులను ఆశ్రయించాలని కఠోపనిషత్తు ప్రబోధిస్తుంది.
ఇక్కడ "దుర్గముడ"నే రాక్షసుడిని ప్రతీకగా చెపుతూ అలాంటి దుర్గమమైన లక్ష్యాన్ని జయించడం లేదా సాధించడం ప్రతి వ్యక్తి కర్తవ్యంగా ప్రేరణ నందిస్తున్నారు.
విజయాన్ని సాధించిన వారి గాథలు ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తాయి. అందుకే ఆ మహాజననిని స్మరించేందుకు మనకా తల్లియొక్క విజయాన్ని (success) చూపుతున్నారు. క్రొత్తదనాన్ని ఆవిష్కరించాలనే మనలోని అంతర్గత తపన తపస్సుగా మారితే ఇతః పూర్వం ఒకరు చూపించిన విజయ సాధనా మార్గం మనకు దారి చూపుతుంది. ఆ మార్గాన్ని ఆశ్రయించి, ఆ మార్గం ఆలంబనగా మనదంటూ క్రొంగొత్త మార్గాలను ఆవిష్కరించడం వల్ల పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాము. అయితే, చేయగలమా లేదా, సాధించగలమా లేదా, ఇది మనకు సాధ్యమా అనే ప్రశ్నలు మనలో ఉత్పన్నమయి మనలను వెనుకకు లాగే అవకాశం ఉంది. విజయ సాధకులు చూపించిన వారి మార్గం అలాంటి భయాలను హరిస్తుంది.
ఈ నాడు సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం ఏదైనా ఒకదానిని ఒకరు సాధించారు అంటే దానిని ఎవరైనా సాధించ గలరు. దుర్గాదేవి కూడా మనకు ఆ ప్రబోధనే ఇస్తుంది. మీరంతా దుర్గమము అనుకునే దానిని నేను సాధించాను కాబట్టి మీరూ సాధించ గలరు. ఆ వైపు మీ సర్వ శక్తులను ఒడ్డి ప్రయత్నించండి. నేను అశక్తుడిని, సాధించలేననే మానసిక వైకల్యాన్ని విడిచి పెట్టండి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట (భగవద్గీత) అంటూ ప్రేరణ నిస్తుంది. సంకల్పం గట్టిదైతే మీ కెదురేమీ ఉండదు. నన్ను నమ్మి ముందుకు సాగితే మీ భయాలను నేను హరిస్తాను, అంటూ అభయం ఇస్తుంది.
అనుమానం పెనుభూతం అంటారు. మనసులో చిన్నమెత్తు అనుమానం పొడసూపినా అపజయాన్ని చవిచూడవలసి వస్తుంది. ప్రయత్నంలో అపజయాలు సహజం. కాని వాటికి భయపడి వెనుకడుగు వేస్తే ఎన్నడూ విజయసాధకులం కాలేము. Faith Power Works Wonders. నమ్మకం అసాధ్యాలనూ సుసాధ్యాలుగా మారుస్తుంది. మీ లక్ష్యం, గమ్యం, గమనం స్పష్టంగా మీ హృదయాలలో ముద్రించుకోండి. నిశ్చలమైన మనస్సుతో ఆ వైపు ఆలోచించండి, దృఢమైన మనస్సుతో అడుగులు వేయండి. సకల శుభములు, అభ్యుదయములు మీ వెంట నడుస్తాయి. శుభాభ్యుదయ ఫలితాలను గూర్చిన ఆలోచనలను మానేయండి. సూర్యునికి అభిముఖంగా మీరు నడచినంత కాలం మీ నీడ మీ వెంటనే వస్తుంది. ఆ నీడయే మీ శుభములు, అభ్యుదయములు. అలా కాక దాని పిరిది దెసలో మీరు నడిస్తే గమ్యం మారుతుంది, గమనం మారిపోతుంది. ఈ స్మృతిని సదాసర్వ కాలముల యందు మీ భావనలో నింపుకొని ముందడుగు వేసే వారికి ఆ దుర్గా దేవి ప్రసన్నురాలవుతుంది.
దారిద్ర్యం, దుఃఖం, భయం ఈ మూడూ మాయా రూపంలో మానవులను క్రమ్మి వారి మానసిక స్థైర్యాన్ని క్రుంగదీస్తాయి. ప్రశాంతత దెబ్బతింటుంది. సత్యాన్ని దర్శించనీయవు. దారిద్ర్యం... అది భావ దారిద్ర్యం కావచ్చు, భాషా దారిద్ర్యం కావచ్చు, అర్థిక దారిద్ర్యం కావచ్చు, మనోదారిద్ర్యం కావచ్చు. ఇలా ఏదైనా మీ అభ్యుదయానికి అడ్డంకిగా గుర్తించండి. దుఃఖానికి మూలం ఆశావ్యామోహాలు. అవి అశాశ్వతాలుగా గుర్తించ గలిగితే దుఃఖాన్ని అధిగమించగలుగుతాము. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమించడం వల్ల కలిగే విభ్రమ వల్ల భయం కలుగుతుంది. కాబట్టి మీ ఇచ్ఛాశక్తిని బలోపేతం చేసుకోండి. ఇఛ్ఛాశక్తి బలమైనదైతే, తత్సాధన కవసరమైన జ్ఞానశక్తిని పొందడం సులువవుతుంది. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. నిద్రాణంగా మీ హృదాకాశంలో ఉన్న చైతన్యానికి చేతన నివ్వండి. నమ్మకాన్ని పెంచుకోండి. ఫలితాన్ని నాకు వదిలేయండి, అంటూ ప్రబోధిస్తూ అభయమిస్తుంది, దుర్గా దేవి. అందుకే ఆమెను దారిద్ర్య దుఃఖ భయహారిణిగా చెపుతూ, ఆ యత్నంలో సఫలత కావాలంటే నీవు కాక మాకు అన్యులు మరెవరమ్మా (కా+త్వత్+అన్యా) అంటుంది, సప్తశతీ శ్లోకం.
మతి మతీవ -- అత్యంత భక్తి శ్రద్ధలతో; స్మృతా -- స్మరించడం వలన; చిత్తా -- హృదయం కలిగిన దానా; దదాసి -- ఇస్తావు లేదా అన్నీ సమకూరేలా చేస్తావు; దేనిని స్మరించడం వలన అంటే దుర్గను అంటే దుర్గమము అని మనం అనుకుంటున్న లక్ష్యాన్ని--- ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఎప్పుడైతే మన మనస్సులో అంకిత భావనతో (Dedication), సాధించాలనే స్థిర నిర్ణయంతో లేదా నిశ్చయంతో కూడిన పట్టుదలతో (perseverance or strong determination), భక్తి శ్రద్ధలతో (Devotion) లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన యందే పదేపదే  మనసును ఏకాగ్రం చేస్తామో (చిత్తం ఒకచోట నిలవదు కాబట్టి పదేపదే చెదురుతున్న మనసును లక్ష్యం వైపు తీసుకొని రావాలి) అప్పుడు ఆ లక్ష్యం అంతర్మనస్సులో బలమైన ముద్రగా ఏర్పడుతుంది. దానిని ఎంతగా బలోపేతం చేస్తే అంతగా బలపడుతూ మనలను లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళుతుంది. దానినే ఆంగ్లంలో  PRAYER (Periodical Repetition of Affirmations Yielding Excellent Results)అంటాం.
ఒకసారి భయం మనలను వీడితే లేదా భయాన్ని మనం జయిస్తే మన మనస్సులలో ఉండే కశ్మలత చెదిరిపోతుంది. దానితో మనలో గందరగోళ (confusion)స్థితి పోయి స్థిరత లేదా స్పష్టత (Clarity) వస్తుంది. ఆ స్పష్టత ఒక దశను దిశను (Direction) చూపుతుంది. సాధనా మార్గంలో కావలసిన వనరులు మనకు సమకూరేలా చేస్తుంది.
అందుకే, మానసిక ధైర్యానికి కావలసిన ప్రేరణ నిచ్చే శక్తిగా, దానికి అవసరమైన సకల ఉపకరణాలను అందించే తల్లిగా దుర్గను ఆరాధిస్తాము.  
విశిష్టమైన జ్ఞానానికి అధినాయకిగా సరస్వతీదేవిని, సమస్త సంపదలకు మారుపేరుగా లక్ష్మీ దేవిని, సౌభాగ్యానికి, భావోద్వేగాలకు, అనుబంధాలకు ప్రతీకగా దుర్గాదేవిని ఆరాధించడం జరుగుతుంది. అంతేకాదు, దుర్గము అనగా కోట. కోట రక్షణ నిస్తుంది. ఆ రక్షణలో హాయిగా, ప్రశాంతంగా జీవిస్తాము. రక్షణ నివ్వాలి అంటే శక్తి కావాలి అందుకే ఆ శక్తికి ప్రతీకగా కూడా దుర్గాదేవిని చెప్పుకుంటాము. అందుకే దుర్గ అంటే రక్షణ నిచ్చే తల్లిగా చెప్పుకుంటాము.
ఈ మూడు మూర్తులకు మూలంగా ఆదిశక్తిని ఆరాధిస్తుంటాము. అలాంటి ఆ ఆదిపరాశక్తికి నమస్సులతో.......
పాలకుర్తి రామమూర్తి


తపోభంగము /"ఉదయశ్రీ"/జంధ్యాల పాపయ్య శాస్త్రి

స్వర్ణదీ స్వర్ణ కంజ కింజల్కములకు
పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము
పట్టుకొని వీడగాలేడు భవుడు; మేను
పులకరింపగ వలపులు తొలకరింప!

ముద్దు లొలికెడి పగడాల మోవిమీద
తళుకు చిఱునవ్వు ముత్యాలు తద్గుణింప
"స్వామి! యేమిది? " యనుచు లజ్జా వినమ్ర
ముఖి యయి యొకింత వారించె ముగుద మునిని!

తపోభంగము /"ఉదయశ్రీ"/జంధ్యాల పాపయ్య శాస్త్రి
పై పద్యాలు రెండు చదువుతుంటే మీకేమి అనిపిస్తుందో చెప్పండి.

భవుడు శివుడు (ఆనందమయుడు) కాలేడు. భవము ఎప్పుడూ సంతోషాన్ని వెదుకుతూ, ఆ ఎండమావుల వెనుక పరుగులు తీస్తూ ఉంది. అభవుడు ఎప్పుడైతే భవుడయ్యాడో గిరి కన్య పాణి తలమే కాదు పాదయుగాన్నీ పట్టుకుంటాడు... విడిచి యుండనూ లేడు. మనము మెచ్చింది ఎప్పుడూ మన కంటికి అందంగా కనిపిస్తుంటుంది... సంతోషాన్ని (ఆనందాన్ని కాదు) ఇస్తుంది. గిరి కన్య కఠినురాలే. ఎందుకంటే తన తండ్రి గిరి కాబట్టి. ఆమె మనసు కూడా కఠినమైనదైనా ఆమె స్వర్ణదీ సంగమంతో పునీతమైన దగుటచే తనకుప్రియమైన భవుని సాన్నిహిత్యంచే కలిగిన వలపుల చేత పులకరింతలు ఏర్పడి అవే అన్యోన్య పలకరి0తలుగా మారిపోవడం జరుగుతుంది.
ప్రకృతిలో రెండు శక్తులు ఉంటాయి. అవే స్త్రీ, పురుష శక్తులు. మనందరిలో కూడా ఆడ మగ అనే భేదం లేకుండా ఉంటాయి అవి. పురుష శక్తి సృజనాత్మకతకు ప్రతీక కాగా స్త్రీ శక్తి అనుభూతికి, అంగీకృతికి ప్రతీకలుగా చెపుతారు. సృజనాత్మకతకు తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఉంటుంది. కోరిక ఉంటుంది. ఆవిష్కరణ జరగాలనే తపన ఉంటుంది. స్త్రీ శక్తిలో ఆలోచన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అనుభూతి ఉంటుంది. శాశ్వతత్త్వానికి దగ్గరగా వెళ్ళాలనే సంయమనత తో కూడిన భావనలుంటాయి. నిజానికి ఈ రెండూ ప్రతి వ్యక్తిలో (ఆడ మగ భేదం లేకుండా) సమపాళ్ళలో ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏ ఒక్కటి పాళ్ళు తప్పినా జీవితం ఆంధోళనాభరితమౌతుంది.
అందుకే ఆమె "యేమిది? " యనుచు లజ్జా వినమ్ర ముఖి యయి యొకింత వారించడం" జరిగింది. అలాగని ఆమె అక్కడినుండి వెళ్లదు. ఎందుకంటే... ఆ అనుభవం ఆమెకూ ఇష్టమే. ఆ తన్మయతను ఆమెకూడా కోరుకుంటుంది.
శృంగారాన్ని ఆవిష్కరించడం కవి యొక్క సమర్ధతపై ఆధారపడియుంటుంది. కామాన్ని చూపడం వేరు శృంగారాన్ని చూపడం వేరు. ఈ రెంటి మధ్య భేదాన్ని తెలియని కవులు వ్రాసే వ్రాతలలో అశ్లీలత చోతుచేసుకొని జుగుప్సను కలిగిస్తుంది.
ఇక జీవునిని బంధించే మాయా బంధనాల వల్ల మనస్సు కఠినమౌతుంది. అందులో "అభవాన్ని" దర్శించడం కష్టసాధ్యం. అందుకే "భవం" నుండి "అభవ" స్థితికి చేరాల్సిన అవసరము ఉంటుంది. అదే సంతోషాన్నుండి ఆనందామృతాన్ని పొందే విధానం.
మరొక్క విషయం. శివుడు.. ఆనందమయుడు. ఆయన కామాన్ని దహించి వేసాడు. కామం అంటే కోరిక. కోరికలు నిశ్శేషంగా దహింప బడ్డాక ఆయనకు ఏ "ఆకలి" లేదు. ఆకలి అంటే అది కడుపుకు ఏదైనా తినేందుకు ప్రేరణ నిచ్చేదే కాదు. కోరికలేవైనా అవి ఆకలి గానే పరిగణించాలి. కామం లేదు కాబట్టి వెండికొండపై తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆనందమయుడై సర్వాన్నీ మరచి అంతర్ముఖుడైన శివునికి ఆకలి లేదు కాని ప్రపంచం సంగతేమిటి? అందుకే అమ్మవారు ఆయన నిష్టను భగ్నం చేయడం జరుగుతుంది. ఆమె అంటుంది.... నీకు కోరికలు లేవు ఆకలి లేదు కాని ఈ ప్రపంచం (పంచభూతాత్మకమైనది) ఆకలితో ఆవరింపబడి ఉంది. సృష్టి జరగాలి అంటే వారి కామం తీరాలి... వారి ఆకలి తీరాలి. కాబట్టి నీ తపో నిష్టను విడిచిపెట్టే కొండను దిగిరమ్మని తాను అన్నపూర్ణగా మారి శివుడిని "శంకరుని" చేసి కాశీలో నిలుపుతుంది.
ఇకపోతే, మనబోటి మామూలు వ్యక్తులు తత్త్వాన్ని అర్థంచేసుకోలేరు కాబట్టి వాటిని గాధల రూపంలో పరిచయం చేసారు. కాలక్రమేణా కవులు వారి వారి కాల్పనిక శక్తిని అనుసరించి చిలువలు పలువలు కల్పించి మామూలు సాంసారిక సుఖాలు కోరుకునే కుటుంబీకుని స్థాయిలో దేవతలను నిలబెట్టారు.
నేను ఇలా స్ఫందించవచ్చునో లేదో తెలియదు. కాని నా స్పందనలో లొసగులు ఉంటే సహృదయులైన సాహితీ మిత్రులు సవరిస్తారనే నమ్మకంతో ఈ నాలుగు మాటలు పంచుకుంటున్నాను.

కృతజ్ఞతా క్షమాపణలతో.... పాలకుర్తి రామమూర్తి