Sunday, May 24, 2015

శంఖ - లిఖితులు
          పూర్వం శంఖ లిఖితులు అనే సోదరులు ఇరువురు ప్రక్కప్రక్కన ఆశ్రమాలు నిర్మించుకొని తపో సాధనలో ఉండేవారు. ఒకనాడు లిఖితుడు తన అన్న ఆశ్రమానికి వెళ్ళాడు. అన్నగారు ఇంట్లో లేరు. ఆశ్రమం ముందున్న తోటలో తిరుగుతూ ఆ తోటలో బాగా మ్రగ్గిన "ఆకర్శణీయ"మైన పండ్లను కోసుకొని తింటున్నాడు. ఇంతలో అన్న వచ్చాడు. తమ్ముడిని అడిగాడు "ఈ పండ్లు ఎక్కడివ"ని. తమ్ముడన్నాడు... ఇవి మీ తోటలోనివేనని. దానికి శంఖుడన్నాడు..."నీది కాని దానిని కామించావు. అనుమతి లేకుండా తీసుకున్నావు, అనుభవించావు" ఇది దొంగతనం క్రిందికి వస్తుంది. ఎదుటి వారెంత స్వంత వారయినా వారి అనుమతి లేకుండా వారి వస్తువులు వాడడం నేరమవుతుంది. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా శిక్షను అనుభవించమన్నాడు. అన్ననా శిక్షను వేయమని తమ్ముడన్నాడు. శిక్ష వేసే అర్హత నాకు లేదు. అది రాజు యొక్క అధికార పరిధిలోకి వస్తుంది. కాబట్టి రాజును ఆశ్రయించమంటాడు. లిఖితుడు సుధాముడనే రాజును ఆశ్రయించడం... అతడు లిఖితుని చేతులు నరికించడం (దొంగతనాలకు విధించే శిక్షను) జరుగుతుంది. తదుపరి లిఖితుడు అన్న వద్దకు వెళ్ళడం.. శంఖుని సూచన మేరకు లిఖితుడు అక్కడే ఉన్న "బాహుదా" నదిలో స్నానం చేస్తాడు. ఆ నదిలో మునిగినంతలోనే మళ్ళీ లిఖితునికి పూర్వం ప్రకారంగా చేతులు వచ్చేస్తాయి.
          ఇది భారతంలోని ఒక కథ. ఇందులో మనం చూడాల్సిన, చూడ దగిన కోణం ఏమిటి?
          నిజానికి, ప్రతివ్యక్తిలో ఒక పెద్దాయన, ఒక తండ్రి, ఒక పిల్లవాడు (APC - Adult, Parent and Child) ఉంటారు. వివిధ సందర్భాలలో ప్రతి వ్యక్తీ ఈ మూడు మనస్తత్వాలతో ప్రవర్తిస్తుంటాడు. ఈ మూడింటికి మరొక్కటి జతచేస్తే... ఒక పిల్లవాడు, యౌవన వంతుడు, ప్రౌఢ వయస్కుడు, వృద్ధుడు ఇలా ఈ అవస్థలను చెప్పుకోవచ్చు.
౧) చిన్న పిల్లడు; పిల్లలలో అమాయకత్వం ఉంటుంది. ఉత్సాహం ఉంటుంది. ప్రతి విషయాన్నీ ఆశ్చర్యంతో చూస్తాడు... తనకు కావలసింది నిష్కల్మషంగా అడుగుతాడు. అడిగినది లభిస్తే ఆనందంలో మునిగి పోతాడు. ఆ అనుభూతిలో చక్కని అనుభవాన్ని పొందుతాడు. ఆ ఆనందంలో దైవత్వం ఉంటుంది.
౨) యువకుడు; యువకునిలో ఆవేశం, సాహసం ఉంటుంది. కామిస్తాడు. విలువ తెలియకుండా ప్రవర్తిస్తాడు. ఎక్కడెక్కడో సంతోషాన్ని వెదుక్కుంటూ తనలో ఉండే ఆనందానికి గుర్తించలేని మానసిక స్థితిలో చంచలత్వానికి ఆశ్రయమిస్తాడు. గమ్యంలేని నిరంతర యానంలో అనుభూతులకు, అనుభవాలకు దూరంగా ఉంటాడు.
౩) ప్రౌఢ వయస్కుడు; ఇతనిలో పరిణతి ఉంటుంది. అనుక్షణం ఉద్యమ స్పూర్తితో, బుద్ధితో ఆలోచిస్తూ, ధైర్యంగా ముందడుగు వేయగలిగిన విచక్షణ ఉంటుంది. నిత్య నవీన యోజనా ప్రణాళికా స్పూర్తితో తన శక్తి సామర్ధ్యాలకు పదను పెట్టుకుంటూ పరస్పరాధారిత సూత్రంతో తనకున్న దానిని పంచుకునేందుకు సిద్ధపడతాడు. అందరి అభిమానాన్ని చూరగొంటాడు. విజ్ఞతతో ప్రవర్తిస్తూ.. ప్రతి అనుభవాన్ని తన అభ్యుదయానికి సోఫానం చేసుకుంటాడు. బాలునిలో తన వార్ధక్యాన్ని చూస్తాడు. యువకునికి మార్గ దర్శన చేస్తాడు. పంచుకోవడంలో ఆనందాన్ని పొందుతాడు.
౪) వృద్ధుడు; తనదంటూ మిగుల్చుకోకుండా తనకున్నది ఆర్తుల కందిస్తాడు. విజ్ఞానం, ప్రజ్ఞ, అనుభవం ఏదైనా అర్హత ప్రాతిపదికగా.. కల్మషంలేని హృదయంతో అందిస్తాడు. ప్రతిగా ఏమీ ఆశించకుండా వివేకంతో, సమర్పణా భావంతో సమర్పిస్తూ ఆనందిస్తాడు. అర్పణచేస్తూ తన్మయుడౌతాడు, తాదాత్మ్యత చెందుతాడు.
ప్రతి వ్యక్తిలో ఏదో ఒక క్షణంలో ఈ నాలుగు అవస్థలు కనిపిస్తూనే ఉంటాయి.
1) తనకు కావలసింది అడిగి ఆనందంగా తీసుకునే సమయంలో బాల్యావస్థను చూస్తాం
2) తనకు కావాలనుకున్నది తానుగా సాధించుకున్న సమయంలో యౌవనాన్ని చూస్తాం
3) ఆలోచనాపూర్ణుడై వివేకంతో తనకున్నదానిని పంచుకునే సమయంలో ప్రౌఢత్వాన్ని చూస్తాం
4) మనఃస్పూర్తిగా సమర్పణ చేయడంలో వార్ధక్యాన్ని చూస్తాం
బాల్యావస్థను ఆశ్రయించాల్సిన లిఖితుడు యౌవనావస్థను ఆశ్రయించాడు. ఆలోచనా పూర్ణుడై పశ్చాత్తాపంతో ప్రౌఢత్వాన్ని పొందాడు. చివరగా దండనను పొందడంతో అహంకారాన్ని వదిలేసి వృద్ధుడయ్యాడు.
(With Thanks and apologies to Sri G. Narayana Guruji)
Palakurthy Rama Murthy






No comments: