మహా భారతంలో కద్రువ, వినత ల కథ (సౌవర్ణోపాఖ్యానం)
పూర్వం కశ్యపుడనే మహాఋషికి కద్రువ, వినత లనే ఇరువురు
భార్యలు ఉండేవారు. ఒకనాడు ఇరువురూ ఆయన వద్దకు సంతానాపేక్షతో వెళ్ళి ఆయనను భక్తితో సేవించారు.
సంతోషించిన కశ్యపుడు వారిని అనుగ్రహంతో చూసి "మీకేం కావాలో కోరుకోండని" అన్నాడు.
ఇద్దరూ తమకు సంతానం కావాలని ప్రార్థించారు. ఆ క్రమంలో కద్రువ... నాథా... వినుత సత్వులు,
దీర్ఘదేహులు, అనలతేజులు (అగ్ని లాంటి తేజస్సు కలిగిన
వారు) అయిన ఒక వేయి మంది పుత్రులు కావాలని కోరుకొన్నది. ఇక వినత... మంచి కుమారులు...
కద్రువ సంతానానికన్న బలవంతులు, తేజో వంతులు అయిన ఇద్దరు కుమారులు
కావాలని కోరింది. (ఈ కోరడం లో కద్రువలోని అత్యాశ, వినతలోని లోకజ్ఞత ప్రకటితమౌతున్నాయి.
వినత కోరిక విన్న కద్రువలో తెలియని అశాంతి. తాను బలవంతులైన సంతానాన్ని వేయి మందిని
కోరితే వినత తెలివిగా ఇద్దరినే ఈ వేయి మందికన్నా బలవంతులను కోరడం ఆమె జీర్ణించుకో లేక
పోయింది. వినతను ఎలా దెబ్బతీయాలని ఆలోచించింది) తధాస్తు అన్నాడు... కశ్యపుడు.
కశ్యప ప్రజాపతి చాలాకాలం తపస్సు చేసి.. పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి
ఆ ప్రసాదాన్ని వారికిస్తూ జాగ్రత్తగా గర్భాలను రక్షించుకోండని చెపుతూ తపస్సుకు వెళ్ళాడు.
ఇక కద్రువ, వినతలు సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి.... గర్భవతులయ్యారు.
కొంతకాలానికి ఆ గర్భాలు అండాలుగా మారడం జరిగింది. ఇరువురూ ఆ అండాలను నేతి కుండలలో భద్రపరచి
జాగ్రత్తగా కాపాడారు. కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కటొకటిగా వెలుగు చూడడం జరిగింది. కద్రువకు మొత్తంగా వేయి మంది జనించారు. వినత భద్రపరచిన
అండాలు అలాగే ఉన్నాయి. సవతికి సంతానం కలగడం, తన అండాలు అలాగే
ఉండడం వల్ల మనసులో ఆందోళన... అపనమ్మకం, అసూయ ముప్పిరిగొనగా వినత
తన రెండు అండాలలో ఒకదానిని విచ్ఛిన్నం చేసింది. అందులో నుండి క్రింది భాగం పూర్తిగా
ఏర్పడని అనూరుడు (అనూరుడు... ఊరువులు లేని వాడు) జన్మించాడు. వినతకు భర్త తపోశక్తిపై
నమ్మకం ఉండాలి. కనీసం కద్రువకు భర్త ఇచ్చిన వరం వల్ల కలిగిన వేయి మంది పిల్లల్ని చూచాకనైనా
నమ్మకం కలగాలి. కాని వినత దుఃఖంతో కూడిన అసూయ, చాపల్యం, సవతిపై మాత్సర్యం వల్ల సృష్టి నియమాన్ని (గ్రుడ్డు తనంత తానే పగిలి
బిడ్డ బయటకు రావడం) ఉల్లంఘించింది. అలా జన్మించిన అనూరుడు తల్లితో ఇలా అంటాడు. తొందరపాటుతో
అసూయాగ్రస్తురాలివై నా శరీరం పూర్తిగా ఏర్పడక ముందే అండాన్ని బ్రద్దలు చేసావు... కాబట్టి
నీ అవినీతికి ప్రాయశ్చిత్తంగా అయిదు వందల సంవత్సరాలు నీ సవతికి దాస్యం చేయి.
తనకు కుమారుడు జన్మించాడని సంతోషించాలా లేక
తన తొందరపాటుకు అవివేకానికి ఆ పుత్రుడు అంగ వైకల్యంతో జన్మించాడని బాధపడాలా? తాను తన
సవతికి దాసీత్వ శాపాన్ని పొందానని బాధపడాలా లేక ఐదు వందల సంవత్సరాల తరువాత నైనా తనకు
అమిత బలవంతుడైన పుత్రుడు జన్మించి తనకు దాస్య విముక్తి కలిగిస్తాడని సంతోషించాలా? ఈ
పరిణామాల నేపథ్యంలో జరిగిన దానికి వేదనా చిత్తయైన వినత నిశ్చేష్టితురాలై చూస్తూ ఉండిపోయింది.
తనకు సరైన ఆకృతి లేకుండా ప్రపంచం మీదకు తెచ్చిన తల్లిపై కోపంతో శపించాడే కాని తదుపరి
కలిగిన పశ్చాత్తాపంతో అనూరుడు... అమ్మా, ఇదంతా విధివశాత్తు జరిగిపోయింది. నీవేమీ విచారించకు..
అయితే మిగిలిన ఆ అండాన్ని మాత్రం అది పక్వం అయేంతవరకూ ఛిద్రం చేయకు. ఆ అండంలోనుండి
వెలువడే లోకోత్తరుడైన కుమారుడు నీ దాస్యాన్ని బాపుతాడు అంటూ.. సూర్యుని రధానికి సారధిగా
వెళతాడు.
ఇది ఇలా ఉండగా, సవతులిరువురూ ఒకనాడు సముద్ర తీరానికి వాహ్యాళికై
వెళ్ళారు. అలా వారు విహరిస్తుండగా వారికి అక్కడ ఉచ్ఛైశ్రవం కనిపిస్తుంది. ఆ అశ్వాన్ని
చూపిస్తూ కద్రువ వినతతో "పాలనురుగు లాంటి తెల్లని తెలుపుతో ఎంతో అందంగా ఉన్న ఆ
గుర్రానికి చంద్రునిలో మచ్చ లాగా ఆ తోక నలుపుగా ఉండడం" బాగా లేదు కదా అంటుంది.
దానికి ప్రతిగా వినత... అక్కా నీవే కన్నులతో చూస్తున్నావు.... ఆ హయానికి తోక కూడా తెల్లగానే
ఉంది, అంటుంది. కద్రువ నల్లని తోక అని వినత కాదు అది తెల్లని
తోక అని... ఇలా ఇరువురూ వాదించుకోవడం జరుగుతుంది. చివరగా... కద్రువ అంటుంది.... ఇన్ని
మాటలెందుకు ఒక పందెం వేసుకుందాము; ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు
నీవు దాసివై ఉండు... అలాకాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసి నౌతాను, అంటూ పందానికి రెచ్చగొడుతుంది. వినత సరేనని ఆ పందానికి ఒప్పుకుంటూ... దగ్గరకు
వెళ్ళి చూద్దాం పదమంటుంది. దానికి ప్రతిగా కద్రువ... ఇప్పుడు ప్రొద్దు పోయింది... భర్త
సేవ చేసుకోవలసిన సమయం ఆసన్నమయింది కాబట్టి తెల్లవారాక వెళ్ళి చూద్దామంటూ వినతతో కూడి
వెనుకకు వస్తుంది.
ఇంటికి వెళ్ళాక కద్రువ తన సంతానాన్ని పిలిచి...
జరిగిన పందెం వివరాలు చెప్పి ఆ గుర్రం యొక్క తోకను ఎలాగైనా నలుపు చేయండని ఆజ్ఞాపిస్తుంది.
పిల్లలెవరూ ఆ అధర్మానికి ఒప్పుకోరు. దానికి అశక్తతతో కూడిన కోపంతో కద్రువ తన సంతానాన్ని
ముందుకాలంలో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరంతా భస్మమవండని శపిస్తుంది. కుపుత్రో
జాయేత్ క్వచిదపి కుమాతా నభవతి అంటారు. (ప్రపంచంలో చెడు సంతానం ఉండవచ్చు కాని చెడు తల్లులు
ఉండరని అంటారు) కాని దానికి భిన్నంగా ధర్మపరులైన సంతానాన్ని అధర్మ మార్గంలో నడవమని
శాసించి అలా చేయని పాపానికి వారిని శపించడం కద్రువ యొక్క మానసిక అసహజస్థితిని సూచిస్తుంది.
అనుశాసనిక పర్వంలో తిక్కన గారు ఈ సందర్భంలో కద్రువకు "భుజంగ" శబ్దం వాడుతారు.
పాము తన పిల్లలను తానే తింటుందనే నానుడిని ఈ భుజంగ శబ్దం ధ్వనిస్తుంది.
శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం
వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడుతూ గుర్రం తోక నల్లదనే భ్రమను కలిగిస్తాడు.
తెల్లవారింది.. యధావిధిగా అనుకున్న విధంగా కద్రువ వినతలు ఇరువురూ ఆ సముద్ర తీరానికి
వెళ్ళి ఆ గుర్రాన్ని దూరం నుండే చూచారు. కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడడం
మూలంగా ఆ తోక నల్లగా కనిపించడమూ... ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసీగా మారడం జరుగుతుంది.
ఇలా ఐదు వందల సంవత్సరాలు గడచిపోయాయి....
ఒకనాడు వినత దగ్గరి అండం విచ్ఛిన్నమై గరుత్మంతుడనే పక్షి జనిస్తాడు. మహా బలవంతుడైన
గరుడుడు కూడా తల్లి ఎలాగైతే కద్రువకు ఆమె సంతతికి దాసీత్వం చేస్తుందో అలాగే ఊడిగం చేస్తూంటాడు.
ఒకనాడు.. ఆ పాములను తన వీపుపై మోస్తూ సూర్య మండలానికి ఎగరడం... ఆ తాపాన్ని భరించలేని
పాములు భూమిపైపడి మూర్ఛ పోవడం, అది చూచిన
కద్రువ కోపగించడం.... జరుగుతుంది.
అత్యంత బలవంతుడైన తాను అల్పప్రాణులైన పాములకు
సేవ జేయడం చూచి ఆవేదన జెందిన గరుత్మంతుడు కద్రువ వద్దకు వెళ్ళి అమ్మా! నీ చెలియల్ చరిమ్చు
నివ్వరవుడపుం చరిత్రమున వచ్చునె నీకొక పేర్మి" అంటాడు. నీ చెల్లెలు నీ వద్ద దాసిగా
ఉండడం నీకు గౌరవంగా ఉంటుందా? ఇంకా "నీ సతిం గరుణ యెలర్పగా విడువ గౌరవ సంపద జేయు
నెంతయున్" అంటాడు. నీ చెల్లెలు దాసీత్వం నుండి విముక్తమైతే నీకెంతో గౌరవంగా ఉంటుందంటాడు.
మా అమ్మ అనడం వేరు, నీ చెల్లెలు అనడం వేరు. మా అమ్మ అనడం వల్ల తనదనే భావన నీ చెల్లెలు
అనడంలో కద్రువకు ఆత్మీయురాలనే భావన ధ్వనిస్తుంటాయి. ఇక్కడ సమయోచితంగా, సగౌరవంగా గరుత్మంతుడు
వేడుకోవడం కనిపిస్తుంది. తాను బలవంతుడు.. కాబట్టి మా అమ్మ దాసీత్వం విముక్తం చేయకుంటే
ఊరుకోను అవసరమైతే మీ జాతిని నాశనం చేస్తానని బెదిరించవచ్చు.
కద్రువ ఉలుకూ పలుకూ లేకుండా ఉంటుంది. అప్పుడంటాడు,
అమ్మా నేనూ నీ కుమారుడినే కదా నన్ను చూసైనా మా అమ్మను విడిచి పెట్టు, అంటాడు. పోనీ
మా అమ్మ దాసీత్వం పోవాలంటే ఏం చేయాలని కద్రువను అడగుతాడు. కుటిలత్వం, కపటత్వం, క్రౌర్యం
పాములకు సహజ లక్షణాలు కావడం అలాంటి పాములను కన్న తల్లి కద్రువ కాబట్టి ఇలా అంటుంది.
"బలవంతుడవు, నైపుణ్యం కలిగిన వాడివి కాబట్టి "లోకులు నిన్నుం ప్రణుతింప తెమ్ము అమృతము" అంటుంది. ఇలా అనడంలో కద్రువలో లౌక్యం ఉంది. అమృతం తేవడం అలవికాని పని.
కాబట్టి ఎలాగూ వినత దాసిత్వం పోదు. ఒకవేళ గరుత్మంతుడు ఆ కార్యాన్ని సాధించి అమృతాన్ని
తెస్తే... జరా మృత్యు భయం లేని అమృత పానం చేత తాను తన సంతానం చిరంజీవులై వర్ధిల్లుతారు.
ఏ విధంగా చూచినా కద్రువకు ఆ కోరిక ఉపయుక్తమే అవుతుంది.
కపట మతి యైన కద్రువ ఇన్ని రోజులుగా వినతతో
సాధారణ పరిచారికలతో చేయించే అన్ని పనులు చేయిస్తూనే ఉంది. తనతో సమానురాలు అనే భావన
ఆమెకేనాడూ లేదు. వినత మాత్రం ఎక్కువ తక్కువ పనులు అనకుండా అన్ని పనులూ కద్రువ అభీష్టానుసారంగా
చేస్తూనే ఉంది. దీనికి మొదటి కారణం వినతలోని ధర్మ బద్ధత కాగా రెండవది తనకు అయిదు వందల
సంవత్సరాల పిమ్మటనైనా అత్యంత బలవంతుడైన కుమారుడు ఉదయిస్తాడనీ అతని వల్ల తన దాసీత్వం
పోతుందనే భావన ప్రేరణలుగా కనిపిస్తాయి.
కద్రువ కోరిన రీతిగానే దేవతలను జయించి గరుత్మంతుడు
అమృతాన్ని తెచ్చి శుచి ప్రదేశంలో దర్భలపై పెడుతూ సర్పాలతో .... కృతస్నాతులై శుచిగా
అమృతాన్ని సేవించడని చెప్పి... వారితో తన తల్లి దాసీత్వం పోయిందనిపించుకొని తల్లితో
కలసి వెళ్ళిపోతాడు. ఆ పాములూ అమృతం లభించిందనే సంతోషంతో... స్నానాదికాలు పూర్తి చేయడానికై
వెళతారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని అపహరించుకొని వెళ్ళి దేవలోకంలో
భద్ర పరుస్తాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. కోరే కోరికలో స్ఫశ్ఠత లేకపోతే వచ్చే అనర్ధం
ఇది. అమృతాన్ని తమకు "ఇవ్వు" అని కద్రువ అడగలేదు... "లోకులు నిన్నున్
ప్రణుతింప తెమ్ము అమృతము" అందామె గరుడుడు తెచ్చాడు. కద్రువాదులు అమృతాన్ని ఉపయోగించే
లోపే దానిని ఇంద్రుడు అపహరించాడు. మోసంతో వినతను దాసీగా చేసుకుంది కద్రువ అలాగే అమృతాన్ని
కోరే క్రమంలో మోసపోయింది.
అమృతాన్ని తెచ్చే క్రమంలో ఆ అమృతాన్ని తాను
ఉపయోగించని గరుడుని నిబద్ధతకు మరియు ఆతని జవసత్వాలను చూసి సంతోషించిన విష్ణువు గరుత్మంతుని
తన వాహనంగా చేసుకుంటాడు.
స్థూలంగా ఇదీ కథ. ఇందులో ఎన్నో సందేహాలు..
౧) కశ్యపుడు మహాఋషి అన్నాము.
ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప
తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
౨) మహా తపస్వియైన భర్త చేసిన
ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం
చేయడం ఎందుకు?
౩) ఒక అంశంపై ఇరువురికీ
వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి
సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా
వేసుకోవడం న్యాయమా?
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు,
తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు
సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి
రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ
దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు
ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను
దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు
భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
అ) అసూయాగ్రస్తులైన సవతుల మధ్య జరగబోయే
పరిణామాలను ముందుగా గ్రహించ గలిగాడు కాబట్టి కశ్యపుడు ఆ పరిణామాలకు తాను సాక్షీభూతుడుగా
ఉండదలచుకోక తపస్సు చేసుకోవడానికై వెళ్ళాడు.
ఆ) ఒకరు ఇద్దరు లేదా పది మంది సంతానాన్ని
కోరడం లోక సహజం కాని కద్రువ వేయి మందిని అదీ దీర్ఘదేహులు, అనిల తేజులు, వినుత సత్వులను కోరడంలోనే ఆమె
అత్యాశ తెలుస్తుంది.
ఇ) తాపసి సంతానం విజ్ఞానార్జన లక్ష్యంగా
దానికి అవసరమైన దేహాభిరతి తో ఉండాలి. కాని ఆమె కోరిక దానికి వ్యతిరిక్తంగా ఉండడమే కాక
వారి నుండి ఆమె ఆశించేదేమిటి? ఈ ప్రపంచంలో తానే అత్యంత
గౌరవనీయురాలుగా చెలామణి కావాలనే అత్యాశ చేతనే దీర్ఘదేహులు, అమిత బలాఢ్యులు కావాలని
కోరడం
ఈ) ఇక వినత... కోరింది ఇరువురినే కాని
సుపుత్రులను కోరింది. ఐనా అందులోనూ సవతిపై మాత్సర్యం కనిపిస్తుంది. అమిత సత్వులను, వీరులను ముఖ్యంగా కద్రువ సంతానాని కన్నా బలవంతులనూ కోరుకొంది.
ఉ) ఇరువురూ స్వధర్మాన్ని కాదని పరధర్మానికి
అవసరమైన లక్షణాలు కలిగిన కుమారులను కోరారు.
ఊ) దీని వల్ల జరగబోయే పరిణామాలను ఊహించగలిగిన
కశ్యపుడు తానారంగం నుండి నిష్క్రమించాడు.
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని
వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం
చేయడం ఎందుకు?
అ) నమ్మక
పోయే అవకాశం లేదు. ఎందుకంటే... మొదటగా భర్త తపోశక్తిపై అపార విశ్వాసం ఉంది అందునా కద్రువకు
పుత్ర సంతానం కలిగింది. అదీ వేయి మంది దీర్ఘదేహులు... తక్షకాది అమిత సత్వులు కలిగారు.
ఆ) కద్రువకు
రోజుకు కొంతమంది చొప్పున చాలా రోజులుగా సంతానం కలుగుతూ ఉంది. ఒకరి తదుపరి ఒకరుగా కలుగుతున్న
సంతానాన్ని గూర్చిన సమాచారం చెలికత్తెల ద్వారా చిలువలు పలువలుగా అందుతూనే ఉంది. ఆ పిల్లలు
చేసే ముద్దు ముచ్చట్లు తెలుస్తున్నాయి. కద్రువ ఎంత సంతోషిస్తున్నదో అర్థం అవుతూనే ఉంది.
ఆ సమాచారం మనసులో తెలియని ఆవేదనను కలిగిస్తున్నది. తనకు తెలియకుండానే మనసు అసూయాగ్రస్తమై
తొందర చేస్తుంది. కద్రువకు సంతానం కలగనంత వరకు తనూ ప్రశాంతం గానే ఉంది. ఎప్పుడైతే సవతి
సంతానవతి యై ఆనందిస్తున్నదో అప్పుడే తనలో తెలియని ఆవేదనాపూర్ణ భావనలు అసూయను ఆశ్రయించడం
చేత తాను చేస్తున్న పనిపైన ఆలోచిస్తున్న విధానంపైన అవగాహనను, పట్టును కోల్పోయింది.
ఇ) ఒక
దానిని విచ్ఛిన్నం చేసి చూద్దామనే కోరిక తీవ్రమై తనను నిలువనీయని స్థితిలో అదుపు తప్పి
ప్రవర్తించడం వల్ల అండ విచ్ఛిత్తికి పాల్పడింది.
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు.
అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు
కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
అ) ఇక్కడ
ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వినత తొందరపాటు వల్ల అనూరుడు జన్మించాడు, తల్లిని శపించాడు. నిజంగా తన తప్పును తెలుసుకున్న
వినత పశ్చాత్తాప పడుతుంది. ఇక కద్రువ తన చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న కారణంగా,
సవతియైన వినతను దాసీగా పొందాలనే దురాలోచనతో దాసీత్వం పందెంగా పెట్టింది.
ఆ) వినత
సంతానాన్ని కోరే క్రమంలో తన సంతానాని కన్నా బలవంతులు కావాలని కోరింది. ఆ వినతా పుత్రులతో
తన సంతానం అపకారం పొందొద్దను కుంటే వారు తన ఆధీనంలో ఉండాలి. సమాన స్థాయిలో ఉండే తమ
మధ్య ఎదుటి వారిని ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం సాధ్య పడుతుంది. కాబట్టి తరతరాలు వారు
తన ఆధీనంలో ఉండాలంటే వినత తనకు దాసీగా ఉండడ మొక్కటే మార్గం. అదీకాక సొమ్ముల లాంటివి
భర్తతో సాధించుకునే అవకాశం ఉంది. ఇన్నీ దృష్టిలో పెట్టుకునే మాత్సర్యగ్రస్తయైన కద్రువ
భౌతిక సంపదలకతీతంగా సవతి దాసీత్వాన్ని కోరుకుంది.
ఇ) రోగీ
పాలనే కోరాడు... వైద్యుడూ పాలే ఇచ్చాడు... అన్నట్లుగా శాప నిమిత్తంగా వినతా దాసీత్వం
వైపే ఆకర్శితురాలైంది.. కద్రువా అదే కోరుకున్నది. కాబట్టి ఇక్కడ న్యాయాన్యాయాలకన్నా
వారిరువురి మనసులు ఆవిష్కరించ బడ్డాయని అనుకోవడం సమంజసం.
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు,
తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
అ) నిజానికైతే
ఉండకూడదు. కాని వినత మనసులో చెలరేగుతున్న అపరాధ భావన ఆ ప్రమత్తతను ఆహ్వానించింది.
ఆ) సవతికి
వేయి మంది సంతానం కలిగారు. తనకు పుత్రులు పుట్టలేదని ఒకప్పుడు బాధ పడింది. తన అవివేకం
వల్ల పుట్టిన వాడు శారీరక అవలక్షణంతో జన్మించాడు. తన కుమారుడే తనను శపించాడు... అయినా
బాధలేదు. తనకు దాసీగా ఉండే యోగం ఉంటే ఉండవచ్చుగాక. కాని అమిత సత్వపూర్ణుడైన కుమారుడు
పుడతాడనే సంకేతం ఆమెకందింది ఆ శాపంలోనే అదే ఆమె ప్రమత్తతకు కారణం.
ఇ) తను
పొందిన శాపంలోనే ఒక ఊరట ఉంది. ఐదు వందల సంవత్సరాల తదుపరి తనకు పుట్టే కుమారుని వల్ల
తన దాస్య విముక్తి జరుగుతుంది అలాగే తాను అనూరుని పట్ల అనుసరించిన అపచారం దాసీత్వం
వల్ల ఉపశమిస్తుంది. కాబట్టే వినతకు ఆ ప్రమత్తత.
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో
తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా
ఉన్నప్పుడు.
అ) దాస్యం
చేయడం వల్ల ఏం కలుగుతుంది? ఆమె అంతరంగంలోని ప్రశ్న... దానికి
జవాబు తనకు రెండవ అండంనుండి కలిగే కుమారుని వల్ల తనకు దాస్య విముక్తి. తాను దాసీ అయితేనే
కదా దాస్య విముక్తి, శాప విముక్తి. అందుకే ఉచ్ఛైశ్రవం యొక్క తోక
నల్ల అని కద్రువ అంటే తనకది అబద్ధమని తెలిసినా దగ్గరికి వెళ్ళి చూడలేదామె. దగ్గరకు
వెళితే తన దాసిత్వం కద్రువకు చెందుతుంది. అది తన లక్ష్యానికి వ్యతిరిక్తమవుతుంది. కాబట్టే
దగ్గరకు వెళ్ళే ఆలోచనను వినత చేయలేదు... అందులోని మోసం దగ్గరకు వెళితే తేటతెల్లమవుతుంది
కాబట్టి కద్రువా దూరం నుండే చూద్దామని అంది.
ఆ) ఐదు
వందల సంవత్సరాలు సవతిని సేవించినా వినత ఆ పనిని ఇష్టంగానే చేసిందట. చేసే పనిని ఇష్టపడండి...
ఇష్టాన్ని ప్రేమించండి... ఆ ఫలితాన్ని ఆస్వాదించండి అనే సామాజిక, వ్యక్తిత్వ సూత్రానికి ప్రతినిధిగా ఆమె కనిపిస్తుంది.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
అ) ఇక్కడ
లోక సహజమైన రీతిని ప్రతిబింబించాడు మరియు స్త్రీ మనసును ఆవిష్కరిస్తాడు వేదవ్యాసుడు
లోకంలో సహజంగా రోగం తగ్గాక వైద్యుని సేవలను వైద్యుడినీ మరచిపోతాడట రోగి; అలాగే భార్యను
పరిగ్రహించాక తల్లిని మరచిపోతారట; ఇంకా స్త్రీలు సంతానం కలిగాక భర్తను దూరంగా ఉంచుతారట.
ఆ లోక రీతిని ఆవిష్కరిస్తున్నాడు వ్యాసభగవానుడు.
ఆ) అసూయాగ్రస్తులైన
వారి పాట్లు ఎలా ఉంటాయనే విధానాన్ని చెపుతున్నాడు
ఇ) ఓర్పు, క్షమా గుణాన్ని సంతరించుకోవడం వల్ల ఎలాంటి ఉత్తమ
ఫలితాలను సాధిస్తామో చెపుతున్నాడు. వినత దాసీత్వాన్ని నిష్ఠతో ఆచరించింది. కుమారుడు
కలిగాక కూడా కద్రువపై చాడీలు చెప్పి వాని మనసు విరిచే ప్రయత్నం చేయలేదు.
ఈ) సమయం, సందర్భం వచ్చే వరకు నిరీక్షించింది. కద్రువ
కుమారులను మోసుకుంటూ గరుత్మంతుడు సూర్యమండలానికి ఎగరడం వల్ల ఆ తాపాన్ని తట్టుకోలేని
పాములు మూర్ఛపోవడం.. దాన్ని చూసి కద్రువ కోపంతో గరుడుని కోపగించడం, ఆ పరిణామానికి వ్యధ చెందిన గరుత్మంతుడు తన తల్లిని దాసీత్వం గూర్చి ప్రశ్నించడం
కనిపిస్తుంది వ్యాసుల రచనలో. గరుడుని మానసంలో కద్రువ పట్ల కలిగిన జుగుప్సా భావన వల్ల
తల్లిని దాసీత్వానికి కారణం ఏమిటని ప్రశ్నించాలనే ఆలోచన కలిగింది. ప్రశ్నించాకే ఆ జిజ్ఞాస
సమంజసమే అనే భావన కలిగాకే వినత కారణాన్ని వివరించింది.
ఉ) కార్య
సాధకుని నిబద్ధతను గరుత్మంతుని అమృతాపహరణ నేపథ్యంలో చూపాడు. గరుత్మంతుడు నిబద్ధతతో
అమృతాన్ని తాను వినియోగించక, తల్లికి
గాని సోదరునికి గాని వినియోగించక కద్రువ కడకు తీసుకు వెళ్ళడం ఆతని నియమ బద్ధతలకు తార్కాణం.
ఊ) దీనివల్ల
గరుత్మంతునికి విష్ణువుకు వాహనంగా సేవచేసుకునే భాగ్యం కలిగింది. అంతేకాక, ఏ అమృత సేవన వల్ల జరామృత్యు భయం లేకుండా ఉండగలమో
అలాంటి భాగ్యాన్ని అమృత సేవనం లేకుండానే విష్ణువు వరం వల్ల పొంద గలిగాడు.
ఋ) గరుత్మంతుడు
అమృతాన్ని తెచ్చి పాములకు ఇచ్చాడు. అయినా ఆ అర్హతను వారు సాధించుకోలేక పోవడం వల్ల వారది
అనుభవించుకోలేక పోయారు. కోరుకునే ముందే దానికి
తగిన అర్హత సాధించాలనే సామాన్య సూత్రం ఇక్కడ ప్రతిపాదించబడింది.
ౠ) ఫలితంపై
ఆశలేకుండా.. చేసే పని పెద్దదా చిన్నదా అనే భావన లేకుండా నియమబద్ధంగా మనసుతో చేస్తే
ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే సందేశం కనిపిస్తుంది.
ఎ) అనింటికన్నా
ముఖ్యంగా ఈ కథ ద్వారా భారత గాధను ఆవిష్కరించాడు వేదవ్యాసుడు. ఇక్కడ వినత కద్రువల మధ్య
సంతానం కారణంగా కలిగిన అసూయా ద్వేషాలే మహాభారతంలోనూ గాంధారీ కుంతిల మధ్య కనిపిస్తాయి.
కుంతికి కుమారుడు కలిగాడు... గాంధారి ఆ మాటను విన్నది... వెంటనే ఈర్ష్యాసూయలు క్రమ్ముకొనగా
తన గర్భాన్ని తాడనం చేసింది. గర్భం వంద ముక్కలయింది. అసూయతో చేసిన తాడనం వల్ల అసూయాగ్రస్తులైన
కౌరవులు జన్మించారు. నిష్కల్మషంగా కుంతి సంతానాన్ని కనింది. వారిలో సౌజన్యం వెల్లివిరిసింది.
వినత అసూయతో చేసిన ప్రయత్నం వల్ల అనూరుడు జన్మించాడు. ఫలితాన్ని చూచాక పశ్చాత్తాపంతో
తన మనసులోని అసూయను కడిగి వేసుకున్నాక తనకు కలిగిన సంతు బలవంతుడూ, కార్య దక్షుడూ అయ్యాడు. కద్రువ సంతానం క్రూరాత్ములు
కాగా కౌరవులూ క్రౌర్యచిత్తులుగానే మిగిలిపోయారు.
ఏ) కౌరవులు
అనుక్షణం పాండవుల శక్తి సామర్ధ్యాలు తలుచుకొని భయపడుతూ జీవచ్ఛవాల వలె జీవించారు. అందుకే
వారి నంతమొందించేందుకు అవసరమైన అన్ని దుర్మార్గ ప్రయత్నాలనూ అనుసరించారు. బ్రతికినన్ని
రోజులూ చస్తూ బ్రతికారు. అలాగే కద్రువ సంతతీ అనుక్షణం భయపడుతూ ఆ భయాన్నుండి బయట పడేందుకు
అమృతాన్ని తెచ్చి ఇవ్వమని కోరారు. భయగ్రస్తులై ద్వేషానికి బానిసలై బ్రతికారు. ఇక పాండవులు
తమను రక్షించేది తామారించే ధర్మం మరియు తమ స్వ ప్రయత్నమనే సిద్ధాంతాన్ని నమ్మడం చేత
తమ పౌరుషాన్నే నమ్ముకొని "జీవించారు". అలాగే గరుత్మంతుడూ అమృతాన్ని సంగ్రహించినా
స్వశక్తిపై ఉన్న నమ్మకంతో ఆ అమృతాన్ని సేవించలేదు.
ఐ) ఇలా
పలు విధాలుగా భారతంతో సంబంధం కలిగిన ఈ కథను చేర్చి ముందుగా చెప్పడం ద్వారా భారత పాత్రలను
సర్వకాలీనం చేస్తూ... అసూయాద్వేషాలకు దూరంగా ఉండండని వ్యాస భగవానులు ప్రజలను హెచ్చరించడం
కనిపిస్తుంది.
No comments:
Post a Comment